Congress Third List : కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మూడో జాబితాను ప్రకటించనుంది. మూడవ జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. మూడో జాబితా కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఇంకా 19 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు.. ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. నోటిఫికేషన్ కు ముందు కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేయాలని అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే వంద స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ.. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై కసరత్తులు చేస్తున్నది. 19 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. నోటిఫికేషన్ డేట్ కన్నా ముందే మొత్తం అభ్యర్థులను ప్రకటించేస్తే వీలైనంత తొందరగా నామినేషన్లు దాఖలు చేసి.. ప్రచారంలోకి దిగిపోయేందుకు చాన్స్ ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా మిగతా అభ్యర్థుల జాబితాపై కసరత్తును పూర్తి చేసి లిస్టును ప్రకటించాలని చూస్తున్నారు.
ఎన్నికల సరళి పర్యవేక్షణకు ఇప్పటికే పార్లమెంట్ సెగ్మెంట్లవారీగా అబ్జర్వర్లను నియమించిన హై కమాండ్.. వివిధ కార్యక్రమాల నిర్వహణ, ప్రెస్ మీట్లు, కమ్యూనికేషన్ల కోసం ఏఐసీసీ అధికార ప్రతినిధులనూ రాష్ట్రానికి పంపింది. కమ్యూనికేషన్ ఇన్ చార్జిగా అజయ్ కుమార్ ఘోష్ను నియమించగా.. తాజాగా ఇద్దరు స్పోక్స్ పర్సన్లనూ పంపింది. వారు నెల రోజుల పాటు ఇక్కడే ఉండి కమ్యూనికేషన్ విభాగం బాధ్యతలను చూసుకోనున్నారు.
ఇక.. కాంగ్రెస్ పెండింగ్లో పెట్టిన 19 స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైరాలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కొత్తగూడెం స్థానంపై ఆచితూచి అడుగులు వేస్తోంది. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, చెన్నూరులో వంశీ వివేక్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. చార్మినార్ నుంచి ఎవరిని బరిలో దింపాలన్న దానిపై తీవ్ర కసరత్తు జరుగుతోంది.
మరోవైపు.. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేయాలని చూస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి రెడీ అంటున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ టికెట్ ఆశిస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్పై బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తుంగతుర్తి కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్కు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. భాన్సువాడలో ఏనుగు రవీందర్రెడ్డి, జుక్కల్ సీటు గంగారానికి టికెట్ దక్కే అవకాశం ఉంది. పఠాన్ చెరు నుంచి నీలం మధు ఆశావాహుల్లో ఉన్నారు.
ఇక.. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకులను బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇల్లెందులో బలరాం నాయక్, సత్తుపల్లిలో మట్టా దయానంద్ టికెట్ ఆశిస్తున్నారు. అశ్వారావుపేటలో ఎవరిని బరిలో దింపాలన్న దానిపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. నారాయణఖేడ్ కాంగ్రెస్ నుంచి సురేశ్ షెట్కార్ టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్ లో మంత్రి గంగులపై బలమైన అభ్యర్థిని దింపాలన్న ఆలోచనలో కాంగ్రెస్ భావిస్తోంది.