Telangana : కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతోంది. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు నేతలు క్యూ కడుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరడం ఇక లాంఛనమే. ఇదే సమయంలో మరిన్ని చేరికలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. తెలంగాణ వ్యవహారాల పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్తో ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి తాజాగా భేటీ అయ్యారు. కాంగ్రెస్లో దామోదర్రెడ్డి చేరికపై చర్చించారు. ఆయన చేరికపై రెండురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు గాంధీభవన్ కు వచ్చి బెల్లంపల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి రేవంత్రెడ్డి ఆహ్వానించారు. నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన నేతలు మాజీమంత్రి గడ్డం వినోద్కుమార్ ఆధ్వర్యంలో హస్తం పార్టీలో చేరారు.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కాంగ్రెస్ను చీల్చేందుకు బీజేపీ, కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు. వందలకోట్లు ఖర్చు చేసి కాంగ్రెస్ను ఓడించాలనుకున్నారని అన్నారు. కర్నాటకలో బీజేపీకి తెలంగాణలో బీఆర్ఎస్కు తేడా ఏమీ లేదన్నారు. అక్కడ గతంలో బీజేపీ 40 శాతం కమీషన్ ప్రభుత్వాన్ని నడిపితే.. ఇక్కడ బీఆర్ఎస్ 30 శాతం కమీషన్ ప్రభుత్వమని ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న లాండ్,సాండ్,మైనింగ్ మాఫియాలో బీఆర్ఎస్ నేతలే ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ప్రశ్నాపత్రాల లీకేజీతో వారి జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుందని మండిపడ్డారు . టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి కేటీఆర్ ధన దాహమే కారణమని ఆరోపించారు. మంత్రివర్గం నుంచి తక్షణమే కేటీఆర్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు ఉండేవని..ఇప్పుడు రేప్ కేసుల్లోనూ బీఆర్ఎస్ నేతలు ఉంటున్నారని ఆరోపించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడాలంటే సిగ్గనిపిస్తోందన్నారు. ఆయన గురించి దేశమంతా తెలిసినా..కేసీఆర్కు తెలియడం లేదా? అని ప్రశ్నించారు.
ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. ఇలా దూకుడుతో ముందుకెళ్లాలని భావిస్తోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదువుతోంది.