Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం.. ఏఐసీసీ అగ్రనేతలంతా నడుం బిగించారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. రేపట్నుంచి మరో లెక్క అన్నట్లుగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో మరింత స్పీడు పెంచనున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, సుఖ్విందర్ సింగ్ సుక్కు, డీకే శివకుమార్, సచిన్ పైలెట్, మాజీ కేంద్రమంత్రులు, ఏఐసీసీ ముఖ్య నాయకులు తెలంగాణలో వాలిపోనున్నారు. హస్తం 6 గ్యారెంటీలను, అభయ హస్తం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేయనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు ఈనెల 28 వరకు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. ఒక్కో నేత రోజుకు 4 నియోజకవర్గాల చొప్పున మొత్తం 90నియోజకవర్గాలలో ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జంట నగరాల్లో రాహుల్ గాంధీతో భారీ రోడ్ షోలు జరిగేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఎలాగైనా ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.