Congress: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు వక్రీకరించారు.. ఆయన చెప్పింది ఒకటైతే.. మీడియాలో వచ్చింది మరొకటి.. ప్రజలకు అది మరోలా అర్థమైంది.. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్కు నష్టం జరగదు.. పార్టీకి నష్టం జరిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు.. ఇదీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జగ్గారెడ్డి చేసిన కామెంట్లు.
కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు కోమటిరెడ్డి.. ఇది ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి కితాబు.
ఇటు జగ్గారెడ్డి.. అటు మహేశ్వర్ రెడ్డి.. ఇద్దరు సీనియర్లు కోమటిరెడ్డిని వెనకేసుకు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. వీళ్లంతా రేవంత్ రెడ్డి యాంటీ బ్యాచ్ అనే ముద్ర ఉంది. సో, కోమటిరెడ్డి ఎంతగా పార్టీని డ్యామేజ్ చేసే మాటలు మాట్లాడినా.. ఆయనకు కొందరు సీనియర్లు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండటం కాంగ్రెస్ లో కామనే. ఆఖరికి పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే సైతం కోమటిరెడ్డి విషయంలో మెత్తపడటం బహుషా కాంగ్రెస్ లోనే సాధ్యం. వాళ్లు వాళ్లు అనుకుంటారు. పార్టీని ఆగమాగం చేసుకుంటారు. ఆ తర్వాత అంతా కలిసిపోయినట్టు ఉంటారు. లోలోన గ్రూప్ వార్ అలానే కంటిన్యూ అవుతుంది. అట్లుంటది మరి కాంగ్రెస్ తోని..అంటున్నారు పార్టీ కార్యకర్తలు.
రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నా.. రేవంత్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నా.. కొందరు సీనియర్లకు మాత్రం అటువైపు వెళ్లేందుకు ఇగో అడ్డొస్తున్నట్టుంది. రేవంత్ పాదయాత్రకు చాలామంది సీనియర్లు డుమ్మా కొడుతున్నారు. మా యాత్ర మాదేనంటూ సొంత యాత్రలకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు ఇంచార్జ్ థాక్రేని కలిసి పాదయాత్ర షెడ్యూల్ పై చర్చలు కూడా జరిపారు. ఈనెల 28న కోమటిరెడ్డి, మార్చి 1న ఉత్తమ్ కుమార్ రెడ్డి, మార్చి 2న భట్టి విక్రమార్క పాదయాత్రలు చేయనున్నారు. ఇక, మహేశ్వర్ రెడ్డి అయితే ఏకంగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ లో అంతే. ఎవరికి వారే.