Congress: సీనియర్లంతా జట్టు కట్టారు. భట్టి ఇంట్లో భేటీ అయ్యారు. వాళ్ల ఉమ్మడి ఎజెండా ఒక్కటే. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడమే. సేవ్ కాంగ్రెస్ పేరుతో కీలక సమావేశం నిర్వహించారు హేమాహేమీలు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి.. ఇలా రేవంత్ రెడ్డి రెబెల్ గ్రూప్ అంతా ఒక్కచోట చేరారు. పార్టీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. అంతాకలిసి ముక్తకంఠంతో రేవంత్ రెడ్డిని విమర్శించారు.
కాంగ్రెస్ ను నాశనం చేసే కుట్ర జరుగుతోందంటూ సీనియర్లు మండిపడ్డారు. పార్టీని హస్తగతం చేసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. వలస వచ్చిన వారికే కాంగ్రెస్ కమిటీల్లో పదవలు ఇచ్చారని.. 108 మందిలో 54 మంది వలస నేతలేనని విమర్శించారు. ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ పోస్టు కూడా బయటి నుంచి వచ్చిన వారికే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. క్యారెక్టర్ లేని వాళ్లు పార్టీని నడిపిస్తున్నారని.. అసలైన కాంగ్రెస్ వాదులను కోవర్టులుగా ప్రచారం చేస్తున్నారని భగ్గుమన్నారు. సొంతపార్టీ వారిపైనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి.. తమను బలహీనపరిచే కుట్ర చేస్తున్నారంటూ సీనియర్లు ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్లు సమావేశం అయ్యారనే విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. భట్టికి ఫోన్ చేయడం మరింత ఆసక్తికరం. తాను సైతం మీ వెంటే ఉంటానని.. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఉంటుదని చెప్పారు. ఇలా కాంగ్రెస్ బిగ్ లీడర్స్ అంతా ఇలా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేయడంతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం రంజుగా మారింది.