MLC Elections : ఎమ్మెల్యేల కోటా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు మహేశ్కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు దక్కుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం రావడమే ఇందుకు మంచి ఉదాహరణగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమవుతాయని భావిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతల తీరుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సర్పంచ్ల బిల్లులు ఆపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు వారి తరఫున పోరాడతామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి రోజు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదలైంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఇద్దరు కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉంటే ఈ నెల 29న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ సుధీర్ఘంగా కసరత్తు చేసింది. ముందుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. చివరి క్షణాల్లో అద్దంకి స్థానంలో మహేశ్కుమార్ గౌడ్ కు అవకాశం దక్కింది. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి.. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు 2027 నవంబర్ 30 వరకు గడువు ఉంది. రెండింటికి విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసెంబ్లీలో అత్యధిక సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్కే రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. మహేశ్కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా ఎన్నికకావడం లాంఛనమే కానుంది.