Congress vs BRS : సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణను దోపిడీ చేశారని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ స్కామ్ల పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. 17 భారీ కుంభకోణాలు జరిగాయని.. వాటి విలువ 4 లక్షల 10వేల కోట్లుగా లెక్క చూపారు.
స్కాంగ్రెస్ అంటూ.. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్ నాయకుల కౌంటర్ ఇది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ. జీవో 111 రద్దుతో ఏకంగా 1 లక్ష 40 వేల కోట్లుగా చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా 50 వేల కోట్లు దోచుకున్నట్టు కాంగ్రెస్ ఆరోపించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో పాతిక వేల కోట్ల రూపాయలు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ వసూలు టెండర్ల ద్వారా 22వేల 620 కోట్లు, మిషన్ భగీరథలో 21వేల 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
AMRకు తాటిచర్ల కోల్ బ్లాక్ మైనింగ్ను లీజుకు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ నాయకులకు 16 వేల కోట్ల రూపాయల లబ్ది చేకూరిందని కాంగ్రెస్ అంటోంది. మిషన్ కాకతీయలో 12 వేల కోట్లు, హరితహారం పేరుతో 8 వేల కోట్లు దోచుకున్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రతిమ సంస్థకు నిషేధిత భూమలు కట్టబెట్టి 5వేల కోట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్లలో అక్రమాల ద్వారా 3వేల 513 కోట్లు కొట్టేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఆయన భూములు కబ్జా చేయడం ద్వారా 2వేల కోట్లు లబ్ది పొందారని కాంగ్రెస్ ఘాటైన ఆరోపణలు చేసింది. హైదరాబాద్ షేక్పేటలో ప్రభుత్వ భూమిని అక్రమంగా.. ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించి 1500 కోట్లు, దళితబంధులో కమీషన్ల రూపంలో ఇప్పటికే 1150 కోట్లు కొట్టేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
మధుకాన్ గ్రూప్ బ్యాంక్ లోన్లు 1064 కోట్లు, మార్క్ఫెడ్ మక్కల కొనుగోళ్లలో అవకతవకల ద్వారా వెయ్యి కోట్లు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్లు బీఆర్ఎస్ నాయకుల జేబుల్లోకి వెళ్లాయంటూ కాంగ్రెస్ ఓ జాబితాను బయటపెట్టింది. కేసీఆర్ పాలన మొత్తం అవినీతి మయం అంటూ ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రజల కోసం అంటూ చేపట్టిన ప్రతి పనిలోను స్వలాభం చూసుకున్నారని ఎద్దేవా చేశారు.
.
.
.