Warangal : వరంగల్లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మహానగర పాలక సంస్థ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనకు పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల నష్టపోయిన కాలనీల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం ముట్టడికి భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు నిలువరించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎంజీఎం కూడలి వద్ద పోలీస్ వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో వరంగల్ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. గ్రేటర్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డుతోపాటు పోతన నగర్ నుంచి హనుమకొండకు వెళ్లే రూట్ ను మూసివేశారు. పోలీసుల ఆంక్షల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు ముందుజాగ్రత్తగా మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ లాంటి ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.