వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ హైదరాబాద్ లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. గన్ పార్క్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వరదల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగా పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ జీహెచ్ఎంసీ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. వరద బాధితులకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఆందోళన నేపథ్యంలో ముందే ప్రభుత్వం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ 3 గేట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించింది. కాంగ్రెస్ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించినా పోలీసులు నిలువరించారు.