Telangana Elections : తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టేందుకు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది . ముఖ్యంగా టికెట్ల కేటాయింపులో ఆచితూచి అడుగులు వేస్తోంది. అసంతృప్తి సెగలు పుట్టే స్థానాలను పెండింగ్లో పెడుతూ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు మూడు దఫాలుగా లిస్టు రిలీజ్ చేసిన అధిష్టానం.. కాంగ్రెస్లో కీలక నేతలుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్కుమార్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇలాఖాలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించకపోవడం.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి స్థానాలు ఆశావహులను ఊరిస్తున్నాయి. ఒక్కో స్థానానికి ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొడనంతో హస్తం నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. పొత్తులో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని మొదట సీపీఎంకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ స్ధానాన్ని పెండింగ్లో పెట్టింది కాంగ్రెస్. అయితే,.. సీపీఎం పెట్టిన డెడ్లైన్ ముగియడంతో హస్తంతో దోస్తానీ కటీఫ్ చెప్పేసి.. సొంతంగా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మిర్యాలగూడ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా జూలకంటి రంగారెడ్డిని బరిలో దించుతున్నట్టు ప్రకటించింది. అయితే,.. సీపీఎంతో పొత్తు వీడాక కూడా ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకలేదు. మిర్యాలగూడ స్థానం కోసం బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శంకర్ నాయక్లు పోటీ పడుతున్నారు.
ఇక సూర్యాపేటలో మంత్రి జగదీష్కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని బరిలో నిలపాలన్న వ్యూహంలో ఉంది . మరోపక్క నేనంటే నేనంటూ టికెట్ కోసం మాజీ మంత్రి దామోదర్రెడ్డి, పటేల్ రమేష్రెడ్డి పట్టుబడుతున్నారు . దీంతో ఈ స్థానాన్ని పెండింగ్ పెట్టింది. అలాగే తుంగతుర్తి స్థానానికి కూడా గట్టి పోటీ ఉంది. మోత్కుపల్లి నర్సింహులు, అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, మందుల సామెల్ టికెట్ ఆశిస్తున్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతోంది… అలాగే నామినేషన్ ప్రక్రియ ముగింపునకు కూడా తొందరలోనే గడువు ముగియనుంది. దీంతో ఆశవహులు ఆందోళన చెందుతున్నారు. అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. ప్రకటించాల్సిన స్థానాలకు అభ్యర్థుకలను ఖరారు చేస్తే గెలుపు దిశగా ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామన్న ఆశతో.. హైకండ్ నిర్ణయం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.