Telangana Elections : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ స్పీడ్ పెంచుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా వరుసగా డిక్లరేషన్లు ప్రకటిస్తూ వెళ్తోంది. కర్ణాటక ఫలితంతో జోరుమీదున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ పాగా వేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలను మొదలు పెట్టింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజ లను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తను మొదలు పెట్టారు. ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూనే.. మరో వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు హామీలను ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మహిళా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్సీ.. ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు మైనార్టీ, బీసీ డిక్లరేషన్ ప్రకటించేందుకు రెడీ అయ్యింది.
జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆకర్షించే పథకాలను ప్రకటించి.. ఆ వర్గాలను కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుపుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. బీసీ వర్గాలను నుంచి ప్రధానంగా ఐదారు డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందులో జనగణనలో కుల గణన, బీసీ రిజర్వేషన్లు పెంపు, ఉద్యోగ నియామకాల్లో క్రీమీలేయర్ విధానాన్ని ఎత్తి వేయడంతో పాటు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ వినిపిస్తున్నారు. భారత్ జోడో యాత్రతో పాటు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం బీసీ నినాదం ఎత్తుకున్నది. 2004 ఎన్నికలకు ముందు వరంగల్లో బీసీ గర్జన నిర్వహించగా.. సోనియాగాంధీ హాజరయ్యారు. బీసీ వర్గాల సమస్యలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ కేడర్, నాయకుల్లోనూ ధీమా రావడం.. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 10వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ సభలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొంటారు. ఇదే సభలో బీసీ డిక్లరేషన్ను ఆయన విడుదల చేస్తారు. అదే రోజు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్ధిని సీఎంగా చేస్తామని బీజేపీ ప్రకటించింది. అందుకు ధీటుగా కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్పై ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామో ఆ డిక్లరేషన్ ద్వారా వివరించనుంది.
మరోవైపు ఈనెల 9వ తేదీన నిజామాబాద్లో నిర్వహించే సభలో కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ను ప్రకటించనుంది. ఈ సభకు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సహా పలువురు మైనార్టీ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీల సంక్షేమం గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఈ సభలో వివరించబోతున్నారు. మొత్తంగా గత కొంత కాలంగా ఓ పక్క చేరికలు, మరోపక్క హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫుల్ స్పీడ్లో ఉంది. మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన ఆరు హామీలను ప్రతీ గ్రామానికి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.