Telangana congress protest(Latest political news telangana) : BRS ప్రభుత్వానికి, కేటీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల చేపట్టారు. ఎక్కడికక్కడ కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను తగలబెట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రైల్వే బ్రిడ్జికి కేసీఆర్ దిష్టిబొమ్మను ఉరి తీసి జిల్లా కాంగ్రెస శ్రేణులు నిరసనలు చేపట్టారు. రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన మాటను కేసీఆర్ మర్చిపోయారని విమర్శించారు. 24 గంటలు కరెంట్ పేరుతో రైతులను మోసం చేశారని కాంగ్రెస్ నేత, కిసాన్ సెల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్కే లేదని మండిపడ్డారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలన పార్టీ విమర్శించడం హాస్యాస్పదమని కామెంట్స్ చేశారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణాలు అర్పించిందని.. రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబం ఏం చేసిందో చెప్పాలని సిరిసిల్ల కాంగ్రెస్ నేతల సవాల్ విసిరారు. కాంగ్రెస్ అంటేనే రైతుల పార్టీ అని.. ఉచిత విద్యుత్ ను అమలు చేసింది రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ కు ఈ హామీ అసలు గుర్తుందా? అని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో కూడా కాంగ్రెస్ నేతలు భారీ నిరసనలు చేపట్టారు. కాసిపేట రైతు వేదిక దగ్గర రైతు తీర్మాన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అడ్డుకున్నారు. రుణమాఫీ ఎందుకు చేయలేదని ఎమ్మెల్యేను నిలదీసే ప్రయత్నం చేశారు. 24 గంటల కరెంట్ ప్రకటనకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. పోలీసులు పహారా మధ్య ఎమ్మెల్యే రసమయి ప్రోగ్రాం పూర్తి చేశారు. అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు.. పోలీసులు తమను కొట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
పీసీసీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. రాహుల్ కి వస్తున్న ఆదరణ తట్టుకోలేక బీజేపీ కుట్రలకు తెరలేపిందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు విమర్శించారు. జోడో యాత్ర తరువాత రాహుల్ గ్రాఫ్ పెరిగిందని.. అందుకే తప్పుడు కేసులు పెట్టి ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని అక్రమంగా రద్దు చేశారని మండిపడ్డారు. అటు, రాహుల్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. రాహుల్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదని అన్నారు.