కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త ప్రోగ్రాంకి అధిష్టానం శ్రీకారం చుట్టింది. తెలంగాణలో ఆరోజు నుంచి గ్రామసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. గాంధీ భవన్లో సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ఈ గ్రామ సభలను చేపట్టనున్నారు.
కాంగ్రెస్ 6 గ్యారంటీల కోసం 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అందులో భాగంగానే గ్రామసభల ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇటు పార్టీ తరుపున, అటు ప్రభుత్వం తరుపున ప్రతినిధులను నియమించి గ్రామ సభలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆ సభ ద్వారానే దరఖాస్తులు స్వీకరించి.. అందరి ఆమోదం తెలిపిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు.
దీని పర్యవేక్షణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించనున్నారు. అయితే, పథకాల అమలులో తమ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఉంటుందని.. సీఎం రేవంత్రెడ్డి గతంలోనే వెల్లడించారు. అయితే తమ కార్యకర్తల భార్యకు, బామ్మర్దికి, తమ్ముళ్లకు, ఇంటోళ్ల పేర్లు పెట్టి అడ్డగోలుగా తీసుకుంటామంటే మాత్రం నడవదని.. నిజమైన అర్హులకే పథకాలు అందజేస్తామని సీఎం తెలిపారు.
అలానే పీఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించగా.. మూడు అంశాలపై తీర్మానం చేసినట్లు పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపామన్నారు షబ్బీర్ అలీ. ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ అగ్రనాయకులందరికీ ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు షబ్బీర్ అలీ.