Congress: కాంగ్రెస్ మారదా? హస్తం నేతలు ఇంకా మారరా? అందుకే అంటారు.. కాంగ్రెస్ను ఎవరూ ఓడించలేరు, తమను తామే ఓడించుకుంటారని. వరుస ఘటనలు ఈ విషయాన్ని పదే పదే నిరూపిస్తున్నాయి. రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. పార్టీలో రచ్చ మామూలుగా లేదు. సీనియర్లు వర్సెస్ రేవంత్.. రచ్చ రంబోలా జరుగుతోంది.
లేటెస్ట్గా మరో వివాదం. ఈసారి కోమటిరెడ్డినో, జగ్గారెడ్డినో కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీన్లోకి వచ్చారు. రేవంత్కు చెక్ పెట్టే స్టేట్మెంట్లు ఇచ్చారు.
ఏప్రిల్ 21న నల్గొండలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగ నిరసన కార్యక్రమం ఉంటుందని రేవంత్రెడ్డి ప్రకటించారు. అట్టెట్టా ప్రకటిస్తారు? నన్ను అడగొద్దా? నాకు చెప్పొద్దా? అంటూ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కస్సుమన్నారు. నేను రాను ఆ ప్రోగ్రామ్కు అంటూ హ్యాండ్ ఇస్తానన్నారు. నల్గొండ తన ఇలాఖా అని.. తనకు చెప్పకుండా ఇక్కడ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడమేంటనేది ఉత్తమ్ వర్షన్. ఈ విషయంపై పార్టీ ఇంఛార్జ్ థాక్రేకు సైతం ఫిర్యాదు చేశారు.
పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డికి కొన్ని నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుందనేది మరిచినట్టున్నారు మాజీ చీఫ్. నల్గొండ ఒక్కటే కాదు.. మరో మూడు జిల్లాల్లోనూ నిరుద్యోగ నిరసనలు, సభలను ప్రకటించారు రేవంత్రెడ్డి. పార్టీ అధ్యక్షుడు, పార్టీ ఇంఛార్జ్తో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతీసారి, ప్రతీజిల్లా నేతలను సంప్రదించడం సాధ్యం కాకపోవచ్చు. పార్టీ అవసరాల మేరకు అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే నిరుద్యోగ నిరసనలను రేవంత్రెడ్డి ప్రకటించారని అంటున్నారు.
వెంటనే నిర్ణయాలు తీసుకునేలా పొలిటికల్ ప్రెజర్ ఉంది మరి. ఓవైపు బీజేపీ దూకుడు మామూలుగా లేదు. హనుమకొండలో నిరుద్యోగ మార్చ్తో TSPSC పేపర్ లీకేజీపై పోరుబాట ప్రారంభించింది. ఉమ్మడి 10 జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్లు ఉంటాయని అనౌన్స్ చేశారు బండి సంజయ్. ఆ రేసులో కాంగ్రెస్ వెనుకబడకూడదనే.. రేవంత్రెడ్డి యమ స్పీడ్గా కాంగ్రెస్ తరఫున నిరుద్యోగ నిరసన సభలను ప్లాన్ చేసి ప్రకటించారు. అందరినీ పిలిచి.. జిల్లాల వారీగా చర్చించి.. డెసిషన్స్ తీసుకోవాలంటే.. ఆలోగా బీజేపీ బండి చాలాదూరం దూసుకుపోతుంది. ఇవేవీ పట్టని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నాకు చెప్పలేదు.. నేనొప్పుకోనంటూ.. తిరకాసు పెట్టడం కరెక్ట్ కాదనేది కొందరు కాంగ్రెస్ నేతల మాట. అయితే, అసలే సీనియర్ మోస్ట్ లీడరాయే.. ఆయన వద్దంటే సభ జరుగుతుందా? అందుకే, 21న నల్గొండ ఎంజీ యూనివర్సిటీలో జరగాల్సిన నిరుద్యోగ నిరసన సభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ మేరకు రేవంత్ స్పీడ్కు సక్సస్ఫుల్గా బ్రేకులు వేయగలిగారు ఉత్తమ్. అట్లుంటది కాంగ్రెస్తోని.