KTR: బీఆర్ఎస్, బీజేపీతో ప్రజలకు ఒరిగేదేం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ ప్రీతంతో కలిసి గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ కేంద్రమంత్రి అయ్యారు గానీ, మతి స్థిమితం లేకుండా మాట్లాతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు చేతనైతే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని అంటున్న బండి సంజయ్ మాటలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం గురించి కేటీఆర్కు పట్టడం లేదని, తమ ప్రభుత్వంపై గెబెల్స్ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఆయన పేరు కేటీఆర్ కాదని జోసెఫ్ గోబెల్స్ అంటూ సెటైర్లు వేశారు. రుణమాఫీ అయిన రైతులందరూ కేటీఆర్ మాటలకు సమాధానం చెప్పాలన్నారు చామల. ‘‘రేవంత్ రెడ్డికి, కేటీఆర్కు పోలిక ఏంటి? రేవంత్ రెడ్డి కింది స్థాయినుండి కష్టపడి ఎదిగిన వ్యక్తి. ఆయన రాజకీయాల్లో మా లాంటి ఎంతో మందికి ఆదర్శం. ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము రాజకీయాలలో కొనసాగుతున్నాం. కేసీఆర్ ఇప్పుడు రాజకీయాలలో ఉన్నారో లేదో తెలియదు. ప్రతిపక్షంలో ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు, మమత బెనర్జీ, స్టాలిన్ దగ్గర నేర్చుకోవాలి. బీఆర్ఎస్ను గద్దె దింపడానికి కారణం కల్వకుంట్ల కుటుంబం వైఖరే. బీఆర్ఎస్ దౌర్భాగ్య పాలన వలనే రాష్ట్ర ఖజానా దిగజారింది. పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పోతే, బీఆర్ఎస్ వాళ్లు పైచాచిక ఆనందం పొందేలా కామెంట్లు చేశారు’’ అంటూ మండిపడ్డారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.