Congress MP Applications (political news telugu):
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ బీ ఫామ్ కోసం నాయకులు భారీగా పోటీ పడుతున్నారు.ఆశావహుల నుంచి అప్లికేషన్ల స్వీకరణకు శనివారం డెడ్ లైన్ కాగా.. చివరి రోజు దాదాపు 166 మంది అప్లై చేసుకున్నారు. దీంతో మొత్తంగా 306 దరఖాస్తులు వచ్చాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మల్కాజ్గిరి నుంచి నిర్మాత బండ్ల గణేష్, సికింద్రాబాద్, ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ల కోసం మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ సీటు కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న కొడుకు పవన్, దగ్గరి బంధువు చల్లూరి మురళీధర్ అప్లై చేశారు. అదే సీటు కోసం చామల కిరణ్ దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా భువనగిరి సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక సూర్యాపేట అసెంబ్లీ సీటు ఆశించి భండపడ్డ పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ కోసం అప్లికేషన్ సమర్పించారు.
ఇక సికింద్రాబాద్ సీటు కోసం డాక్టర్ రవీందర్ గౌడ్, వేణుగోపాల్ స్వామి, వరంగల్ నుంచి మోత్కుపల్లి నర్సింహులు, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, మహబూబాబాద్ నుంచి విజయాబాయ్ దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు.
ఖమ్మం సీటు కోసం గట్టి పోటీ ఉంది. భట్టి విక్రమార్క భార్యతో పాటు.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగేంధర్, మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షులు జెట్టి కుసుమ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూల్ సెగ్మెంటు కోసం మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆయన కూతురు చంద్ర ప్రియ అప్లికేషన్ సమర్పించారు. ఇక మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మల్కాజ్గిరి, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
17 సీట్ల కోసం 306 దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు.