– డబుల్ బెడ్రూం అన్నారు.. ఇచ్చింది లేదు
– ఉద్యోగాలన్నారు.. భర్తీ చేసింది లేదు
– ఇప్పుడు అవన్నీ మేమిస్తుంటే విమర్శలా?
– కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని జనం ముందుకొస్తున్నారు?
– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర సంపద దోపిడీకి గురయ్యింది
– కేసీఆర్పై భట్టి విక్రమార్క ఫైర్
Deputy CM Bhatti: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి సంస్థ సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్కు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అనంతరం, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0 నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఐ అండ్ డీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రామగుండం ఆర్టీఎస్ బీ ప్లాంట్ను పరిశీలించారు మంత్రులు. 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను వీక్షించారు.
మేం మీలా మోసగాళ్లం కాదు!
పర్యటనలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. అర కొర హామీలు నెరవేర్చిన కేసీఆర్, 2 లక్షల రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ఏం చేశారని అడుగుతున్నారని, పదేళ్లలో కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేని ఆయన విమర్శిస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా, ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం అధికారంలోకి రాగానే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఇది తప్పని చెప్పడానికి కేసీఆర్ బయటకు వస్తున్నారా? అని అడిగారు. తాము 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామని ఇవ్వలేకపోయాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పడానికి వస్తున్నారా? అంటూ ఎద్దేవ చేశారు. కేటీఆర్ మాదిరి డబ్బులను తాము విదేశాలలో దాచి పెట్టుకోలేదన్న భట్టి, ఎన్నడూ, ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికునికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. చివరకు జీతాలు కూడా సరైన సమయానికి ఇవ్వలేని పరిస్థితుల్లోకి తెలంగాణను తెచ్చిన పాపం కేసీఆర్దేనని విమర్శలు చేశారు.
Also Read: Farm Loans: రైతుల సొమ్ము.. రాబందుల పాలు.. వ్యవసాయ సొసైటీల్లో అవినీతి తిమింగలాలు
కేటీఆర్ మాటలు నాన్సెన్స్
కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. తాము ఆరు గ్యారెంటీలతో 13 వాగ్ధానాలు ఇచ్చామన్నారు. ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, హామీల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. వాల్మీకి స్కామ్ విషయంలో కేటీఆర్ ఆరోపణలు నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు ఐటీ చుట్టూ టూమచ్ హైప్ క్రియేట్ చేశారని, ఫలితం మాత్రం శూన్యమని విమర్శలు చేశారు.
రామగుండానికి పూర్వవైభవం
రామగుండం ప్రాంతం సమృద్ధిగా వనరులు, నీరు, బొగ్గు దొరికే ప్రాంతమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉమ్మడి జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందని, విద్యార్థి దశ నుండి తనకు రాజకీయంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఈ జిల్లాల్లో బొగ్గు విద్యుత్ కేంద్రాలు ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పారు. రామగుండం చరిత్రలో నిలిచిపోయే విధంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయం పరంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పక్కనే ఉందని, నీటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరింత చొరవ తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. ఇది సింగరేణి అడ్డా ఎన్టీపీసీ అడ్డా, వారు అడుగుతున్న న్యాయమైన డిమాండ్స్ పరిశీలించాలని చెప్పారు. రామగుండానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.