తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి.. టాప్ గేర్లో దూసుకెళ్తోంది. టీ కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసింది. నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు షురూ చేసింది. ప్రజాగర్జన పేరుతో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించి.. సత్తా చాటనుంది కాంగ్రెస్ పార్టీ.
చేవెళ్ల సభ కోసం హస్తం పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రజా గర్జన సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. 9 ఏళ్ల నుంచి ఎస్టీ, ఎస్సీలను పట్టించుకోవడం లేదని.. వారికి తీవ్ర అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ క్రమంలో వారికి తాము ఉన్నామనే భరోసా కలిగించేందుకు.. చేవెళ్ల సభ ద్వారా ప్రయత్నిస్తామంటోంది. దళిత, గిరిజన వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తామని హస్తం పార్టీ చెబుతోంది. దళిత, గిరిజనులకు ఉచిత విద్యుత్ అంశాన్ని డిక్లరేషన్లో ప్రకటిస్తారని తెలుస్తోంది.
చేవెళ్ల సభలో పాల్గొనేందుకు వస్తున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే… తొలుత బెంగళూరు నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. సాయంత్రం 5.30కి చేవెళ్లలో బహిరంగ సభ ఉంటుంది. ప్రజా గర్జన సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ జన సమీకరణ చేస్తున్నాయి. చేవెళ్ల సభతో ప్రజా గర్జనను ప్రగతి భవన్కు వినిపించేలా చేస్తామంటోంది హస్తం పార్టీ.