తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క , పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు.
42పేజీల్లో 66 ప్రధాన అంశాలతో అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను రూపొందించారు. ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రకటించింది. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్లు ప్రకటించింది. ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసి తెలంగాణలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
కాంగ్రెస్ అభయహస్తం.. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సంక్షేమానికి ఈ మేనిఫెస్టో దిక్సూచి లాంటిదన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
రాజకీయాలు కాదు.. ప్రజలే తమకు ముఖ్యమన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి.. అక్రమాలు తప్ప ఇంకేమీ లేవన్నారు. తెలంగాణను పోరాడి సాధించుకున్నది ఇందుకోసమేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తామిచ్చిన హామీలను అమలు చేయడం పక్కా అన్నారు ఖర్గే.
మేనిఫెస్టోలోని అంశాలు..
6 గ్యారెంటీలకు అదనంగా 67 అంశాలు
ప్రజల ఆకాంక్షలు మేరకు పూర్తిస్థాయిలో ప్రజాస్వామిక పరిపాలన
సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజా దర్బార్
తెలంగాణ తొలి, మలి దశ అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ. 25 వేల గౌరవ పెన్షన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం