Congress : తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ ప్రారంభమైందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో చేరికలు.. ఆశామాషి రాజకీయ పునరేకీకరణ కాదన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ కాలరాశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం కాకుండా.. కుటుంబం, పదవుల కోసమే గులాబీ బాస్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఫౌంహౌస్ కేంద్రంగా.. కాంట్రాక్టుల కోసం రాష్ట్రాన్ని ఫణంగా పెట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనే పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు రేవంత్రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు రేవంత్రెడ్డి. పార్టీలో ఉన్న సీనియర్లతోపాటు కొత్తవచ్చిన వారికి స్థాయిని బట్టి పార్టీ అవకాశాలు కల్పిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాపీ చేస్తుందని హామీ ఇచ్చారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. గతంలో మేం చెబితే కేసీఆర్ విమర్శించారు. ఆర్టీసీ ఉద్యోగులు పోరాడినా కేసీఆర్ కనికరించలేదని మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనమని చెప్పి కమిటీ పేరుతో కాలయాపన చేస్తారని విమర్శించారు.
కాంగ్రెస్ చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. ప్రజలను మభ్యపట్టి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని.. దేశ చరిత్రలో ఇంతపెద్ద అవినీతి సీఎం ఎక్కడా లేరని విమర్శించారు. తెలంగాణలో రాజకీయ ప్రతిష్టను కేసీఆర్ భ్రష్టుపట్టించారని, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్కు.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు జూపల్లి కృష్ణారావు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్పై విశ్వాసం ఉందన్నారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ స్నేహబంధం ప్రజలందరికీ అర్ధమైందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిందని.. గడిచిన తొమ్మిదేళ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.