MadhuYaskhi Comments on KCR: పింకీ తమ్ముళ్లు సంబరపడకండి.. జడ్జిమెంట్ ను తెలుసుకోండి అంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సుప్రీం కోర్టు తీర్పుపై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండు. టెక్నికల్ పాయింట్స్ పైనే జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయమన్నది. పింకీ తమ్ముళ్లు సంబరపడకండి.. జడ్జిమెంట్ను తెలుసుకోండి. తప్పు చేయకుంటే విచారణ కమిషన్ ముందు హాజరుకావొచ్చుగా?. తప్పు చేయనప్పుడు ఎందుకు కల్వకుంట్ల కుటుంబంలో కలవరం?’ అంటూ ఆయన ప్రశ్నించారు.
‘పది ఏండ్లలో రూ. 80 వేల కోట్ల అవినీతి చేశారు. గతంలోనే విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని నేను చెప్పా. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే విద్యుత్ ఒప్పందాల పేరిట రూ. 133 కోట్ల కమీషన్ కేటీఆర్, హరీష్ రావులు తీసుకున్నారని గోవాలో జరిగిన ఒక సమావేశంలో వ్యాపారవేత్తలు వాపోయిన విషయం అందరికీ తెలిసిందే. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు సవాలు విసిరి కాలు దువ్వింది నిజం కాదా..? ఇప్పుడు విచారణ చేపడుతుంటే.. కోర్టులను ఆశ్రయించి అడ్డుకట్ట వేయ్యాలన్న విషయంతోనే మీ దుర్నీతి బయటపడుతుంది. తెలంగాణ రాకముందు మీ ఆస్తుల ఎంత..? వచ్చాక ఆస్తులు ఎంత..? అన్ని బయటకు వచ్చి జైలుకు పోతారు. అభివృద్ధి పేరుతో.. ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో రూ. వేలాది కోట్లు దోచుకున్నారు’ అని మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: పవర్ కమిషన్ చైర్మన్గా తప్పుకుంటున్నా.. జస్టిస్ నరసింహారెడ్డి లేఖ
చెట్ల సంతోష్ పత్తా లేకుండా పోయిండు
‘విచారణను అడ్డుకోవాలని కేసీఆర్ చూస్తున్నారు. కేసీఆర్ అవినీతి చేయలేదని సుప్రీంకోర్టు ఏమీ చెప్పలేదు. కొత్త జడ్జి వచ్చి అవినీతిని బయటకు తీస్తాడు. కేసీఆర్, కేటీఆర్ ,హరీష్ రావు లు అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పలేదు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచారణను ఆపమని చెప్తున్నాడు. తెలంగాణ బిడ్డల నుంచి మీరు చేసిన దోపిడీ కక్కించాల్సిన బాధ్యత మా రేవంత్ సర్కార్ మీద ఉంది. మేమెక్కడా కూడా కక్షపూరితంగా వ్యవహరించడం లేదు.. చట్టబద్ధంగానే విచారణ చేపట్టి కేసీఆర్ ను జైల్లో పెడతాం. మీ అక్రమ ఆస్తులు ఎంతనో.. మీకు సహకరించిన అధికారుల ఆస్తులు ఎంతనో లెక్కతీస్తాం. గ్రీన్ ఛాలెంజ్ అని హడావిడి చేసే చెట్ల సంతోష్ పత్తా లేకుండా పోయిండు. వాళ్ల ఆవిడా పేరుమీద నర్సరీ పెట్టి రూ. కోట్లు దోచుకున్నారు. దానిపై కూడా విచారణ చేపట్టాలి’ అంటూ ఆయన మండిపడ్డారు.