Marri Shashidharreddy : బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కి కాంగ్రెస్ షాకిచ్చింది. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతకు ముందు కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి 6 సంవత్సరాలపాటు సస్పెండ్ చేసింది.
కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందన్నారు. అది నయం చేయలేని స్థితికి చేరుకుందని విమర్శించారు. మాణిక్కం ఠాకూర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్కం ఠాకూ ర్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నోటీసులు తీసుకునేందుకు రెడీగా ఉండాలన్నారు. అసత్య ఆరోపణలు చేసినందుకు మధురై కోర్టు వైపు పరుగులు పెట్టిస్తానని శశిధర్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ చేసిన ఆరోపణలపై మాణిక్కం ఠాకూర్ లీగల్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులపై బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.