Congress news telangana(TS politics) : తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే పార్టీ శ్రేణులను సంయమనం చేసేందుకు పలు కమిటీలను పునర్ వ్యవస్థీకరించడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది.
తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని హైకమాండ్ నియమించింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ను నియమించిన కాగ్రెస్ అధిష్ఠానం.. కో ఛైర్మన్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలను అపాయింట్ చేసింది. మరో 37మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది.
ఇందులో పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ ఆఫీస్ బేరర్లు, పార్టీకి సంబంధించిన పలు శాఖలు, డీసీసీ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏఐసీసీ జాబితాను విడుదల చేసింది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు లోక్సభ నియోజకవర్గాల వారీగా ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. వీరి నియామక ప్రతిపాదనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు.