– తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్లు
– తెలంగాణకు మహేష్ కుమార్ గౌడ్ ఖరారైనట్లు ప్రచారం
Congress: టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అనేక సమావేశాలు, చర్చల అనంతరం, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఈమధ్యే దీనిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఢిల్లీ వెళ్లొచ్చారు. పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు. ఆశావహులు ఇప్పటికీ ఢిల్లీలోనే ఉండి మంతనాలు జరుపుతున్నారు.
ఇద్దరి మధ్యే పోటీ
టీపీసీసీ చీఫ్ పదవిని బీసీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరూ పదవి కోసం పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలనే దానికి పార్టీ నేతలతో అధిష్టానం అనేక చర్చలు జరిపింది. చివరకు మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈయన గత మూడేళ్లుగా పీసీసీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. యువజన కాంగ్రెస్ నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి.
Also Read: Kalki 2898 AD: కల్కి డిలిటెడ్ సీన్స్.. డిలీట్ చేయడమే బెటర్ అన్నట్టు ఉన్నాయే
మరో రెండు రాష్ట్రాలకు కూడా!
తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్లను కాంగ్రెస్ నియమించనుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా ఉన్న దీపా దాస్ మున్షీకి వెస్ట్ బెంగాల్ పీసీసీ పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్గా చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ వచ్చే అవకాశం ఉంది. ఇక కేసీ వేణుగోపాల్కు కేరళ పీసీసీ అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నియామకాలపై ఏ క్షణమైనా ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.