Crop Loan Waiver Scheme: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం పరిధిని రూ. 10 లక్షలకు పెంచింది. ఇప్పుడు ఎంతో కీలకమైన రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా ఎకరాకు రూ. 15 వేలు ఆర్థికసాయం అందిస్తామని తెలిపింది. రైతు కూలీలను ఆదుకుంటామని భరోసా ఇచ్చింది. వారికి ఏటా రూ. 12 వేలు ఇస్తామని భరోసా కల్పించింది. రైతుల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఒకేసారి రూ. 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే దిశగా చర్యలు ప్రారంభించింది.
రైతు రుణమాఫీపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. తాజాగా రైతు రుణమాఫీపై ధరణి కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతుల అప్పుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని తెలిపారు. డేటా రాగానే రుణమాఫీ చేస్తామని స్పష్టంచేశారు. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని చెప్పారు. అలాగే బోనస్ కింద రూ. 500 చెల్లిస్తామన్నారు. వరికి మద్దతు ధర ప్రస్తుతం రూ. 2060 రూపాయలుగా ఉంది. తాము రూ. 2600 చెల్లిస్తామని కోదండరెడ్డి హామీ ఇచ్చారు.
Read More: మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్.. విజిలెన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు..
మరోవైపు 6 గ్యారంటీల్లో మిగిలిన పథకాలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఇచ్చిన హామీలను 100 రోజుల్లోపే అమలు చేస్తామని సీఎం చాలాసార్లు చెప్పారు. ఆ మాట నెలబెట్టుకునే దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. త్వరలో గృహజ్యోతి పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను నిర్ణయించే ప్రక్రియ కొనసాగుతుంది. గృహజ్యోతి స్కీమ్ ద్వారా 200 యూనిట్ ఉచిత విద్యుత్ ను పేదలకు అందిస్తారు.
అలాగే రూ. 500కే గ్యాస్ సిలిండర్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇలా 6 గ్యారంటీలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.