Congress Future : జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. ఓవైపు సంస్థాగత మార్పులు చేసింది. దేశమంతా విస్తృతంగా ప్రచారం చేసేలా అగ్రనేతల షెడ్యూల్స్ ఖరారవుతున్నాయి. ఈసారి గెలుపు పక్కాగా ఉండేలా డీల్ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు టర్మ్ లు బీజేపీ అధికారంలో ఉండగా.. ఈ దఫా అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కంటే భిన్నంగా.. పక్కాగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది కాంగ్రెస్.
జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ స్పీడ్ పెంచుతోంది. ఓవైపు సంస్థాగత మార్పులు చేసింది. దేశమంతా విస్తృతంగా ప్రచారం చేసేలా అగ్రనేతల షెడ్యూల్స్ ఖరారవుతున్నాయి. ఈసారి గెలుపు పక్కాగా ఉండేలా డీల్ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు టర్మ్ లు బీజేపీ అధికారంలో ఉండగా.. ఈ దఫా అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కంటే భిన్నంగా.. పక్కాగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇటీవలే జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణలో తప్ప మిగితా చోట్ల ఓడినా.. ఓటు బ్యాంకుపై పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. అంటే గతం నుంచి మద్దతుగా ఉన్న వారంతా అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నారు. దీంతో అదే పాజిటివ్ మూడ్ ను లోక్ సభ ఎన్నికల వరకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీకి పక్కాగా చెక్ పెట్టాలంటే ఏమేం చేయాలో ఆ అస్త్రాలన్నీ బయటకు తీస్తున్నారు. అందులో భాగంగానే మొదట సంస్థాగత పదవుల్లో మార్పులు చేర్పులు చేశారు.
దేశంలో కాంగ్రెస్ జోరు హోరు పెంచేందుకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారీ కార్యాచరణ రెడీ చేస్తున్నారు. ఇంతకు ముందులా కాకుండా ఈసారి పక్కాగా రిజల్ట్ వచ్చేలా డీల్ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో పార్టీకి, రాహుల్ కు మైలేజ్ మరింత పెరగడానికి కారణమైంది. తాజాగా చేపట్టబోయే భారత న్యాయ్ యాత్రతో మరింత స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. మణిపూర్ టూ మహారాష్ట్ర దాకా ఈ యాత్ర కవర్ చేయనున్నారు. ఓటు బ్యాంకును పెంచుకోవడం.. వాటిని లోక్ సభ సీట్ల రూపంలోకి మలుచుకోవడం పెద్ద టాస్క్ గా మారింది. అయితే ఈ ఫార్ములాను వర్కవుట్ చేయడమే లక్ష్యంగా ఢిల్లీలో యాక్షన్ ప్లాన్ ఖరారైంది.
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు హస్తం పార్టీ ఎలాంటి వ్యూహాలతో వెళ్తుందో ఓసారి చూద్దాం. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 9 మంది ప్రధాన కార్యదర్శుల సంఖ్యను 12కి పెంచింది. ఎనిమిది మంది పాత వారిని అలాగే ఉంచి తారిక్ అన్వర్ ను పక్కన పెట్టారు. కొత్తగా నలుగురిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతల నుంచి మాణిక్రావ్ ఠాక్రేని తప్పించి కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి దీపా దాస్మున్షీకి అప్పగించింది హైకమాండ్. తెలంగాణకు పూర్తిస్థాయి పార్టీ ఇన్చార్జిని నియమించే వరకూ అదనపు బాధ్యతలను దీపాదాస్ మున్షీకి అప్పగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలయ్యే వరకూ ఆయననే టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉంటారని అంటున్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకూ దీపాదాస్ మున్షీనే అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం గోవా బాధ్యతలు చూస్తున్న తమిళనాడుకు చెందిన ఎంపీ మాణికం ఠాగూర్కు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల పార్టీ బాధ్యతలు కట్టబెట్టారు.
రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ను కొత్తగా ప్రధాన కార్యదర్శిగా నియమించి ఛత్తీస్గఢ్ పార్టీ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు ప్రధాన కార్యదర్శి హోదాలో ఉత్తర్ప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రియాంకా గాంధీకి ఈ సారి ఏ రాష్ట్ర బాధ్యతలూ అప్పగించలేదు. అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రియాంకకు ఈ వెసులుబాటు కల్పించారు. నిజానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్లను ప్రకటించినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ప్రియాంక. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీకి యూపీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్కు రాయ్బరేలీ సీటు మాత్రమే లభించింది. అలాగే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఏడు నుంచి రెండుకు తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్కు దూరంగా ఉన్నారు. అయితే ఈసారి యూపీ నుంచి మెజార్టీ ఎంపీ స్థానాలు ఎలా కైవసం చేసుకోవాలన్న వ్యూహాలు కొనసాగుతున్నాయి. అవినాష్ పాండేకు ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టో కమిటీకి ఇన్ఛార్జ్గా ఈయనే ఉన్నారు. ఇప్పుడు యూపీ గెలుపు బాధ్యతలను అప్పగించారు.
కేరళకు చెందిన కీలక కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితలకు మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒక్క లోక్ సభ సీటు మాత్రమే గెలిచింది. దీంతో ఈ పరిస్థితిని మార్చాలని హైకమాండ్ పూర్తిగా డిసైడ్ అయింది. 48 సీట్లున్న మహారాష్ట్రలో ఎన్ని ఎక్కువ గెలిస్తే అధికారానికి అంత దగ్గరైనట్లు లెక్క. అందుకే ఈసారి మహారాష్ట్రలో పట్టు సాధించేందుకు సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రాండ్ ర్యాలీకి నాగ్ పూర్ నే వేదికగా ఎంచుకున్నారు. అక్కడి నుంచే హమ్ తయ్యార్ హై అంటూ సిగ్నల్స్ పంపారు.
మోహన్ ప్రకాశ్కు బిహార్ కాంగ్రెస్ ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వగా; చెల్లకుమార్కు మేఘాలయ, మిజోరం, అరుణాచల్ప్రదేశ్; అజయ్ కుమార్కు ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి వ్యవహారాలు అప్పగించారు. కీలకమైన కర్ణాటకకు రణ్ దీప్ సింగ్ సూర్జేవాలను నియమించారు. ఇటీవలే అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో గతంలో కంటే ఎక్కువ లోక్ సభ సీట్లు గెలిచే వ్యూహాలు అప్లై చేస్తున్నారు. అటు భరత్సింగ్ సోలంకికి జమ్మూకశ్మీర్; రాజీవ్ శుక్లాకు హిమాచల్ప్రదేశ్, చండీగఢ్; సుఖ్జిందర్సింగ్ రణధావాకు రాజస్థాన్; దేవేందర్ యాదవ్కు పంజాబ్; మాణిక్రావ్ ఠాక్రేకు గోవా, డామన్ డయ్యూ, దాద్రానగర్హవేలీ; గిరీశ్ చోడంకర్కు త్రిపుర, సిక్కిం, మణిపుర్, నాగాలాండ్; మాణికం ఠాగూర్కు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్; గుర్దీప్సింగ్ సప్పల్కు సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. అటు జైరాం రమేశ్ ను కమ్యూనికేషన్ ఇంఛార్జ్ గా నియమించారు. కేసీ వేణుగోపాల్ ఆర్గనైజింగ్ ఇంఛార్జ్ సెక్రెటరీ జనరల్ గా కొనసాగనున్నారు. పార్టీ కోశాధికారిగా అజయ్మాకన్ కంటిన్యూ అవుతుండగా, సంయుక్త కోశాధికారులుగా మిలింద్దేవరా, విజయ్ ఇందర్ సింగ్లా నియమితులయ్యారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ముందుగా ఈ మార్పులు చేస్తేనే పార్టీ బలోపేతమవుతుందని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు వారంతా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగేశారు. పైగా ఏఐసీసీ ఆఫీస్ లో రోజూ ఎన్నికల కసరత్తు కొనసాగుతోంది.