తెలంగాణలో ఎన్నికలకు ఇక మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఒకవైపు పార్టీలో నేతల చేరికలపై దృష్టిపెట్టింది. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీపీసీసీ ప్రకటించింది. దరఖాస్తు రుసుం ఖరారు చేసింది. బీసీ అభ్యర్థులకు రూ.25 వేలు, జనరల్ అభ్యర్థులు రూ. 50 వేలుగా దరఖాస్తు రుసుం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నుంచి ఎలాంటి రుసం స్వీకరించరు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దరఖాస్తు ప్రక్రియ స్టేట్ స్క్రీనింగ్ కమిటీ మానిటిరింగ్ చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము సూచనలు మాత్రమే చేస్తామన్నారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాత్రమే అభ్యర్థులను ఫైనల్ చేస్తుందని వివరించారు. కాంగ్రెస్ పార్టీపై విధేయత, పనితీరు, గెలుపు అవకాశాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.