Congress : తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల బలం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. అన్నివర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ కు మద్దతు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని ప్రజల్లో విశ్వాసం ఉంది. ఇన్ని సానుకూలాంశాలు ఉన్నా ఓట్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలవుతోంది. అందుకే వరస పరాజయాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ ను బాగా దెబ్బతీస్తున్నాయి. అందుకే పార్టీ పటిష్టతకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీలో ప్రక్షాళనకు ఏఐసీసీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమాయత్తమవుతున్నారు.
తెలంగాణపై కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ.. రాజకీయంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోయింది. మరోపక్క బీజేపీ మాత్రం బలాన్ని పెంచుకుంటూ వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఖర్గే పార్టీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. టీపీసీసీ కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంపై ఫోకస్ చేశారు.
టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై చాలామంది నేతలు ఖర్గేను కలిసి తమ అభిప్రాయాలను వివరించారు. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ నేతలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మాణిక్యం ఠాకూర్ స్థానంలో మరో నేతకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను ఖర్గే అప్పగించే యోచనలో ఉన్నారని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో పోటీకి నిలబడే అభ్యర్థి దొరకడం కూడా కష్టమైంది. ఫలితంగా హస్తం పార్టీకి ఏపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ క్రమంలో పార్టీ పటిష్టతకు అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే.. రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితులు, బలోపేతంపై దృష్టి పెట్టారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షలు చేస్తున్నారు. ఏపీకి కొత్త పీసీసీగా గిడుగు రుద్రరాజును నియమించారు. అలాగే కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. అయితే ఏపీలో మార్పులు ఏ మేరకు సత్ఫలితాలనిస్తాయో చూడాలి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్న ఖర్గే .. సూపర్ పీసీసీ పదవి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారట. తెలుగు రాష్ట్రాలపై అవగాహన ఉన్న నేతకు ఈ బాధ్యత అప్పగిస్తారట. అందుకే సూపర్ పీసీసీ అనే కొత్త పదవి తెరమీదకు వస్తోంది. ఒకవేళ ఏపీ, తెలంగాణకు కలిపి సూపర్ పీసీసీని కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాటు చేస్తే.. దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనే దానిపై అప్పుడే కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది.