Congress Complaint to EC: హైదరాబాద్ బంజారాహిల్స్లో మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వాళ్లకే ఓటు వేశానని తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత కూడా బంజారాహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటర్లనుద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు పోలింగ్ సందర్భంగా దుమారం రేపాయి. బీఆర్ఎస్ గుర్తయిన కారుకు ఓటు వేయాలని మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని సీఈవోకి ఫిర్యాదు చేసింది. కవితపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మంత్రి హరీష్ రావు – శ్రీనిత దంపతులు, కొడుకు అర్చిస్ మాన్ సిద్ధిపేటలో ఓటు వేశారు.
మంత్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే హైదరాబాద్ లోని అంబర్పేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్, అతని కుమారుడు అసదుద్దీన్ ఓటు వేశారు.