Congress: తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కార్యకర్తలకు తాజాగా ఓ పిలుపు ఇచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలంటూ పిలుపునిచ్చింది. మహిళల ఉచిత బస్ ప్రయాణంపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ టీపీసీసీ పేర్కొన్నది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచితంగా మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ బస్సులలో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేయండి అంటూ కేటీఆర్ అత్యంత అవహేళనగా మాట్లాడారు. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరికి నిరసనగా రేపు అనగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాల్లో కేటీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేయాలని, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: రాజీనామా చేయాలన్న రేవంత్ డిమాండ్పై రెస్పాండైన హరీశ్రావు.. ఏమన్నారంటే..?
అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన విన్నవించారు. కేటీఆర్ వెంటనే మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలంటూ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.