తెలంగాణలో కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర చేపట్టింది. తాండూరులో యాత్రను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.
తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్ నిర్మించిందన్నారు. నగరంలో మత సామరస్యాన్ని నిలబెట్టిందని తెలిపారు. లంచాలు ఇచ్చినోళ్లకే కేసీఆర్ మంచమేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేనదన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు.
లంచాలు ఇవ్వని స్థిరాస్తి వ్యాపారులను కేటీఆర్ అణచివేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
గత ఐదేళ్లపాలనలో కేసీఆర్ రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు. సాగుకు ఎక్కడా 8 నుంచి 10 గంటలకు మించి కరెంట్ ఇవ్వట్లేదని తెలిపారు. హామీలు అమలు చేయలేదు కాబట్టే ఓటమిని కేసీఆర్ ముందుగానే ఒప్పేసుకున్నారని అన్నారు.
తెలంగాణ ఇచ్చేటప్పుడు సోనియా గాంధీ అధికారం కోసం చూడలేదని డీకే శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలు అధికారంలోకి వచ్చినట్లేనని స్పష్టం చేశారు. యూపీఏ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేసిందన్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తున్నామని తేల్చిచెప్పారు.
మరి తెలంగాణలో కేసీఆర్ గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేశారా అని డీకే ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది. కర్ణాటకలోనూ 5 గ్యారంటీలు ఇచ్చి ఆ హామీలను అమలు చేస్తోందన్నారు. హామీలు అమలు అవుతున్నాయో లేదో కర్ణాటకకు వచ్చి చూడాలని సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ కోసం బస్సు పెడతామన్నారు. వారు చెప్పిన టైమ్ కే బస్సు పంపిస్తామని తెలిపారు. కర్ణాటక వచ్చి పథకాల అమల తీరును ప్రజలను అడిగి తెలుసుకోవాలని సవాల్ చేశారు.
కర్ణాటకలో 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తున్నామన్నారు డీకే. కోటి 10 లక్షల మంది మహిళలకు గృహలక్ష్మి పథకం కింద రూ. 2 వేలు అందిస్తున్నామన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. అందుకే కర్ణాటకకు వచ్చి పథకాల అమలు తీరు చూడాలని కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ కోరారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల కృతజ్ఞత చూపాలని ఓటర్లను డీకే శివకుమార్ కోరారు.
కాంగ్రెస్ ఏదైనా హామీ ఇచ్చింది అంటే.. తప్పక నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ పేదల గురించి మాత్రమే ఆలోచిస్తుందని స్పష్టం చేాశారు.