తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో నడిచేందుకు సిద్ధమవుతున్నాయని సమాచారం. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నాయి. కాంగ్రెస్ నుంచి స్నేహహస్తం వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే.. సీపీఎం, సీపీఐ నాయకులను చర్చలకు ఆహ్వానించారని తెలుస్తోంది.రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు ప్రకటించాయి.
మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎం మద్దతు తెలిపాయి. గులాబీ పార్టీ విజయం కోసం పనిచేశాయి. ఆ ఎన్నికల నుంచి బీఆర్ఎస్, వామపక్షాల మధ్య స్నేహం ప్రారంభమైంది. సీట్ల సర్దుబాటుపై గతంలో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య చర్చలు జరిగాయి. సీపీఎం, సీపీఐకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రతిపాదించింది. చెరో 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని వామపక్షాలు పట్టుబట్టాయి.
ఎమ్మెల్సీ సీట్లకు బదులు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరింది. సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు ఇస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. అయితే పాలేరు, మిర్యాలగూడెంలో ఒక స్థానం ఇవ్వాలని సీపీఎం.. కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్లో ఒక సీటు ఇవ్వాలని సీపీఐ కోరాయి. కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేయడంతో చర్చలు ఫలించలేదు.
కానీ ఇటీవల కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో వామపక్ష నేతలు షాక్ తిన్నారు. సీపీఐ, సీపీఎం హైదరాబాద్లో ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించాయి. కేసీఆర్ ఏకపక్షంగా తమ అభ్యర్థులను ప్రకటించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పొత్తు లేదని కేసీఆర్ తేల్చేసిన తర్వాత తాము వెంపర్లాడబోమని స్పష్టం చేశారు.
బీజేపీతో బీఆర్ఎస్ కు సఖ్యత ఉందని తేలిపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల సత్తా చూపిస్తామని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ ను ఓడించడమే ఎన్నికల నినాదంగా ముందుకెళ్తామని కూనంనేని స్పష్టం చేశారు.
మరోవైపు తాజాగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ , వామపక్షాలు కలిసి పోటీ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ, ఇండియా కూటములకు బీఆర్ఎస్ సమదూరం పాటిస్తోందని తెలిపారు. వామపక్షాలు ఇండియా కూటమిలో ఉండటం వల్లే ఆ పార్టీలతో కలిసి పోటీ చేయకూడదని బీఆర్ఎస్ బాస్ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని తెలిపారు.