Collector Bhavesh Mishra: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తన బూట్లను అటెండర్ తో మోయించిన ఘటన కలకలం రేపింది. జిల్లా కేంద్రంలో ఉన్న ఒక చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి కలెక్టర్ షూ లతో ప్రవేశించారు. వెంటనే తన షూ విప్పి.. పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. అటెండర్ ధఫేదార్ వాటిని తీసుకెళ్లి చర్చి బయట వదిలివచ్చారు. అక్కడున్నవారంతా ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.
వ్యక్తులకు పదువులెంత గౌరవాన్ని తెస్తాయో.. ఆ వ్యక్తి కూడా పదవికి అంతే వన్నె తెచ్చే విధంగా ఉండాలి. కానీ.. ఇప్పుడీ కలెక్టర్ చేసిన పని కారణంగా.. సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 2015 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ భవేశ్ మిశ్రా ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఉట్నూర్ లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా, ఆ తర్వాత భద్రాచలం సబ్ కలెక్టర్ గా కూడా పనిచేశారు. కాగా.. అటెండర్ తో బూట్లు మోయించడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులే అయినపుడు.. తోటి ఉద్యోగిని ఇలా కించపరచకూడదన్నారు.