Congress: కాంగ్రెస్ మారదు.. కాంగ్రెస్ను ఎవరూ మార్చలేరు.. హస్తం పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలు.. గ్రూపులు.. వర్గ విభేదాలు. కుక్కతోక వంకరలాంటి పార్టీని సక్కగా చేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్రామ్ ఠాక్రే. అయితే, లేటెస్ట్గా ఠాక్రే ముందే.. నల్గొండ నేతలు పెద్ద గొడవకు దిగారు. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ను ఠాక్రేకు చూపించారు. ఇంతకీ అసలేం జరిగిందంటే…
హాత్ సే హాత్ జోడో యాత్ర ఏర్పాట్లపై కోదాడలో నల్గొండ పార్లమెంటరీ పార్టీ నేతల సమీక్ష జరిగింది. ఈ మీటింగ్కు మాణిక్రామ్ ఠాక్రే వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమీక్షలో సూర్యాపేట నియోజక వర్గ నాయకుల మధ్య వివాదం మొదలైంది. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్రెడ్డిల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఠాక్రే సాక్షిగా ఇరు వర్గాలు తీవ్ర వాగ్వాదానికి దిగి.. రచ్చ రచ్చ చేశాయి.
ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ పరోక్షంగా పటేల్ రమేశ్రెడ్డిని ఉద్దేశించి దామోదర్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనిపై రమేశ్రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో వాగ్వాదానికి దిగారు. సమావేశంలో తమని అవమానించారని.. సరైన గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ఇక, నల్లగొండ పార్లమెంటరీ సమావేశానికి 8 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. అయితే, ఈ మీటింగ్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వర్గానికి చెందిన పలువురు నేతలు హాజరు కాలేదు. చెరుకు సుధాకర్, అద్దంకి దయాకర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, బీర్ల ఐలయ్య, బత్తుల లక్ష్మారెడ్డిలు డుమ్మా కొట్టారు. సమీక్షా సమావేశానికి ఉత్తమ్ వర్గానికి చెందిన నాయకులు మాత్రమే అటెండ్ అయ్యారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి మాత్రమే రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డి హాజరుకాగా.. ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో పెద్ద గొడవే జరిగింది. ఇదంతా చూసి.. మాణిక్రావ్ ఠాక్రేకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్సా.. మజాకా.