Telangana Govt: తెలంగాణలోని ప్రతి ఒక్క కుటుంబానికీ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డు అందించాలనీ, ఆ కార్డును ఆ కుటుంబంలోని మహిళ పేరిట ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. శనివారం ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సంబంధిత అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఒకే కార్డులోకి రేషన్, హెల్త్, ఇతర పథకాలు వర్తింపజేస్తామని అన్నారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హుల నిర్ధారణ చేస్తామని వెల్లడించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి పైలట్ ప్రాజెక్ట్గా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.
అన్నింటికీ ఒకే కార్డు..
రేషన్, ఆరోగ్య శ్రీ వంటి వేర్వేరు కార్డులుండటం వల్ల గందరగోళం నెలకొందని, ఈ పరిస్థితిని నివారించేందుకే ఒకే కార్డుపై అన్ని రకాల పథకాలు పొందేలా ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని, ఈ కార్డు ద్వారా లబ్ధిదారులు ఎక్కడినుంచైనా రేషను వస్తువులను తీసుకోవచ్చని, ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చని, ఆ దిశగా ఉపయోగపడేలా ఈ కార్డులు ఉంటాయని స్పష్టం చేశారు. వైద్యారోగ్య అవసరాలకు చికిత్స పొందే సమయానికి సదరు వ్యక్తికి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డు ద్వారా డాక్టర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. ఈ డిజిటల్ కార్డులో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చని వెల్లడించారు.
కమిటీ ముందుకు రిపోర్ట్
ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల్లో పర్యటించిన అధికారులు, తాము చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా, ప్రతిపాదిత ఫ్యామిలీ డిజిటల్ కార్డులలో ఏ ఏ అంశాలను పొందుపరచాలో రిపోర్ట్ తయారుచేసి ఆదివారం సాయంత్రం నాటికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీకి అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు అందులో జత చేయాల్సిన, తొలగించాల్సిన అంశాలను సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు.
పైలట్ ప్రాజెక్టుగా..
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో రెండు ప్రాంతాలను (ఒక గ్రామీణ, ఒక పట్టణ) ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సీఎం సూచించారు. కుటుంబాల నిర్ధారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా అక్టోబరు మూడో తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి (డోర్ టూ డోర్) పరిశీలన చేయించాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టును పకడ్బందీగా చేపట్టాలని, దీని పర్యవేక్షణకు నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి అధికారిని, పట్టణ ప్రాంతంలో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలని సలహా ఇచ్చారు.