CM RevanthReddy comments: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబసభ్యులు ఒకచోటకు రావడం అభినందనీయమన్నారు సీఎం రేవంత్రెడ్డి. కమ్మ అంటే అమ్మవారని, అమ్మ బిడ్డ కడుపు చూస్తుందన్నా రు. కమ్మ వారు వ్యవసాయం చేసి పదిమందికి అన్నం పెడుతున్నారన్నారు. అనర్గళంగా మాట్లాడడం తాను ఎన్టీఆర్ను చూసి నేర్చుకున్నానని, ఎన్టీఆర్ లైబ్రరీలో చదివిన చదువు మమ్మల్ని ఉన్నతస్థాయికి తీసుకొచ్చిందన్నారు.
హైదరాబాద్లోని మాదాపూర్లో జరిగిన కమ్మ కమ్యూనిటీ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్కు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కుసుమకుమార్, విదేశాలకు చెందినవారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి, రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్ అని, తెలుగు రాష్ట్రాల్లో మంచి రాజకీయ నాయకులున్నారంటే అందుకు ఆయనే కారణమన్నారు.
హైదరాబాద్ విశ్వనగరంగా మార్చే ప్రణాళిక మీరు భాగస్వాములు కావాలన్నారు సీఎం రేవంత్రెడ్డి. మీలో ఉన్న ప్రతిభను ప్రొత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పన్నులు కట్టే ప్రాంతం లో నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. నిరసనను అణిచివేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో గతేడాది డిసెంబర్ మూడు తారీఖున చూశామన్నారు. ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. అది ప్రభుత్వాల బాధ్యతగా వర్ణించారు.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడివాళ్లు అమెరికాలోని వైట్హౌస్ ముందు నిరసన తెలిపార ని గుర్తుచేశారు సీఎం రేవంత్రెడ్డి. తమకు నచ్చని పనులు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా నిరసన లు చేయవచ్చాన్నారు. ప్రజలు నిరసన తెలపాలని భావించినప్పుడు వాళ్లని నిర్భంధించాలన్న ఆలోచన వారి పతనానికి దారితీసిందన్నారు. చంద్రబాబు అరెస్ట్పై నిరసనలకు హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని పరోక్షంగా తప్పుబట్టారాయన.
ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్రావు తప్పక హాజరుకావాల్సిందే!
ఢిల్లీలో ఇప్పుడు నాయకత్వ లోపం కనిపిస్తోందని, జైపాల్రెడ్డి, పీవీ లాంటి తెలుగు నేతలు లేరన్నారు సీఎం రేవంత్రెడ్డి. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని తాము భావించామన్నారు. ఢిల్లీలో మనకు గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరని గుర్తు చేశారు. అమరావతి నుండి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరూ కాదనలేరన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల్లో మనవాళ్లు చాలామంది ఉన్నారన్నారు.
కమ్మ సంఘానికి ఐదెకరాల భూమి ఇచ్చినట్లే ఇచ్చి గత పాలకులు లిటిగేషన్ పెట్టారని, ఆ విషయం తన దృష్టిలో ఉందన్నారు. కమ్మ సంఘం భవనం కట్టడానికి భూమి ఇస్తామన్నారు. నిర్మాణానికి అవసరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.