CM Revanth Warning(Political news today telangana): ప్రజలను వేధిస్తే వేటే అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. ప్రజలను ఇబ్బంది పెట్టి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారాయన. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తనిఖీ చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.
సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా పాలమూరులో విద్యుత్ అధికారుల తనిఖీల అంశం చర్చకు వచ్చింది. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు? తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చింది ఎవరు? అని సమీక్షకు హాజరైన ట్రాన్స్కో సీఎండీ రిజ్విని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా.. లేదా.. అని నిలదీశారు. ఇదే సమావేశంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పందించారు.
శాఖాపరమైన నిర్ణయం లేకుండా డిస్కం డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చారని, దీంతో అక్కడున్న ఎస్ఈ NSRమూర్తి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఇష్యూలో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలిగించామని, SEని బదిలీ చేశామని భట్టి విక్రమార్క ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని మరోసారి స్పష్టంచేశారు రేవంత్రెడ్డి. తమకు తోచినట్లు సొంత నిర్ణయాలు తీసుకొని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు.