CM Revanth Reddy Visits Yadagirigutta(Latest news in telangana): నేడు యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి రేవంత్ సందర్శించనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి యాదాద్రి వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక ఛాపర్లో సీఎం యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఇవాళ్టి నుంచి యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 21 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
ఆరుగురు మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నుంచి భద్రాచలం వెళ్లనున్నారు. అక్కడ రామయ్యను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత భద్రాచలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తదనంతరం భద్రాచలం సీతారామ ఆలయ అభివృద్ధి, నీటిపారుదలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం మణుగూరులో నిర్వహిస్తున్న బహిరంగసభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.