CM Revanth vs KCR: రుణమాఫీ అంశం.. తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. తెర వెనుక జాగ్రత్తగా పావులు కదుపుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ ఎంతవరకు అయ్యింది? అనేదానిపై గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే పనిలో పడింది. నియోజకవర్గాల నేతలకు ఆ బాధ్యతలు అప్పగించినట్టు కారు పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. కేవలం 20 రోజుల్లో మొత్తం సమాచారాన్ని సేకరించాలనే నిర్ణయం పెట్టుకుందని తెలుస్తోంది.
ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. గడిచిన పదేళ్లు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేసీఆర్ సర్కార్ కూడా నాలుగు విడతలుగా రైతులకు రుణమాఫీ చేసిందన్నది ఆ పార్టీ మాట. రైతులకు నిజంగా రుణమాఫీ జరిగితే.. ఆధార్కార్డు, పేర్లలో సమస్యలు ఇవన్నీ తేడా ఎందుకు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ALSO READ: కాళేశ్వరం గుట్టు విప్పిన మాజీ నరేందర్రెడ్డి, ఉచ్చులో బీఆర్ఎస్ కీలక నేతలు
ఆనాడే కేసీఆర్ సర్కార్ రైతుల సమస్యలు సరి చేస్తే… ఇవాళ్టి రోజున రుణమాఫీ అమలకు ఇన్ని సమస్యలు వచ్చేవి కావని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ లెక్కన బీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలన్నీ ఒట్టిమాటలేనని అంటున్నారు. రుణమాఫీని పక్కన పెట్టి దానికి అనుకూలంగా రైతుబంధు స్కీమ్ని తీసుకొచ్చారన్నది వారి మాట.
అధికార ప్రభుత్వ రుణమాఫీ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్రయత్నంలో పడింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు రూరల్ ప్రాంతాలు బాగా దెబ్బ కొట్టాయి. రుణమాఫీ అంశంతో వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
బీఆర్ఎస్ వ్యూహాలను పసిగట్టిన రేవంత్ సర్కార్, రైతులకు సూచన చేసింది. దీనికి సమయం అయిపోలేదని, రైతులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే రుణమాఫీ అవుతుందని సాక్షాత్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు చెక్ పడినట్లేనా?