CM Revanth Reddy Visited Ujjaini Mahankali Temple: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత సీఎంకు ఆలయ పండితులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎంకు ఆశీస్సులు ఇచ్చి.. తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.
ఉదయం నుంచి అమ్మవారికి ప్రముఖులు, భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించి.. మొక్కులను చెల్లించుకునేందుకు బారులు తీరారు. పిల్లలు, పెద్దలు అంతా అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
బోనాలు పండుగకు తోడు.. గురుపూర్ణిమ కూడా కలిసి రావడంతో ఊరు, వాడ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఓ వైపు గ్రామ దేవతల ఆలయాలు, మరోవైపు గురువుగా భావించే సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి సాయిబాబా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.