CM Revanth Reddy Tweet on Telangana Budget 2024(latest news in telangana): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నాడు కుటుంబ పద్దు.. నేడు ప్రజల పద్దు అని.. డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కూడిన ఫోటోను జత చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని తెలంగాణ ప్రజలు తమ సందేశాలను జత చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. తాము అధికారంలోకి వచ్చీరాగానే దొర పాలనను గుర్తుచేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఎత్తివేయడం లాంటి ఎన్నో దుశ్చర్యలకు పాల్పడింది కేసీఆర్ సర్కార్. ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Read More: తెలంగాణ బడ్జెట్ రూ. 2,75,891 కోట్లు.. 6 గ్యారంటీలకు రూ. రూ. 53,196 కోట్లు..
అటువంటి రాచరిక పోకడలకు ప్రజలు చరమగీతం పాడారని కాంగ్రెస్ నాయకులు చెబుతూనే ఉన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ప్రజలను పట్టించుకోలేదు. కనీసం సాటి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేదంటే కుటుంబపాలన ఏమేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు.
తెలంగాణ కోసం తన జీవితాన్ని ధార పోసిన గద్దర్పై కూడా కనికరం చూపించలేదు. మూడు గంటల పాటు ప్రగతి భవన్ గేటు ముందు ఎండలో కూర్చోబెట్టిన ఘనత దొరవారిది. రాజ్యాన్నే ఎదిరించి తుపాకి తూటాలు శరీరానికి తూట్లు పొడిచినా తెలంగాణ నినాదాన్ని వదలని గద్దర్ తన చివరి రోజుల్లో ఇలాంటివి చూస్తారని కలలో కూడా ఊహించి ఉండరు.
ప్రజలను కలవని ముఖ్యమంత్రి ఎందుకు అని తెలంగాణ ప్రజానీకంలో చర్చ మొదలయ్యింది. సచివాలయానికి రాని సీఎంను శాశ్వతంగా సచివాలయానికి దూరం చెయ్యాలని ఓటర్లు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. మూడోసారి ఎన్నికలు దొరవారికి బాగానే బుద్ధి చెప్పాయి. తన పార్టీ లోంచి తెలంగాణ పదాన్ని తీసేసిన వారికి తెలంగాణలో చోటు లేదని స్పష్టతనిచ్చారు ఓటరుమహాశయులు.
Read More: ‘అబద్దాల బడ్జెట్ కాదు.. మాది వాస్తవిక బడ్జెట్’
ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలనను అందిస్తామని చెప్పింది. మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి, తన ప్రమాణస్వీకారం రోజే ప్రగతి భవన్ దగ్గర ఇనుప కంచెలను కూల్చేసి తెలంగాణలో ప్రజాపాలనకు నాంది పలికారు. ప్రజాపాలన పేరుతో తానే స్వయంగా ప్రజల నుంచి అర్జీలను తీసుకోవడంతో తెలంగాణకు మంచి రోజులొచ్చాయని కారు పార్టీ నేతలే చెప్పారు. ఇక ఆనాటి నుంచి నేటి వరకు సీఎం తీసుకున్న ప్రతి నిర్ణయం తెలంగాణ ప్రజల నిర్ణయం లానే అనిపించింది.
తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిన కేసీఆర్ సర్కార్పై ప్రజలు నిప్పులు చెరిగారు. అందెశ్రీ రాసిన తెలంగాణ పాట జయ జయ హే తెలంగాణ పాట తెలంగాణ జాతీయ గీతంగా ప్రతి స్కూల్లో పాడుకున్నారు. కానీ దొర ఆ పాటను దగ్గరికి కూడా రానివ్వలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ప్రకటించడంతో తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు ఇది నిజంగా ప్రజాపాలనే అని అభివర్ణించారు.
ఇది నిజాంను తరిమికొట్టిన తెలంగాణ. దొర పోకడలను ఏనాడూ తెలంగాణ ప్రజలు సహించలేదు. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమైనా, మలి దశ తెలంగాణ ఉద్యమమైనా, మూడో దఫా ఎన్నికలైనా తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి ప్రపంచం మొత్తానికి ఆదర్శం. అందుకే కుటుంబ పాలన పద్దుకు ప్రజా పాలన పద్దుకు చాలా వ్యత్యాసం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజల పద్దులో ప్రజా సంక్షేమం ఉంటుందని, విద్య, వైద్యంకు సరైన న్యాయం జరుగుతోందని అంటున్నారు.