Telangana Drugs | గంజాయి, కొకైన్, బ్రౌన్షుగర్, ఎల్ఎస్డీ, హాష్ ఆయిల్.. పేరు ఏదైనా అంతా ఒక్కటే. అదే డ్రగ్స్. ఇలా రకరకాల వ్యసనాలకు యువత చిత్తవుతోంది. సమాజాన్ని పెడదోవ పట్టించే ఈ మత్తు దందాను కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మత్తు పదార్థాల సరఫరా, అమ్మకం, వాడకంపై పటిష్ట నిఘా పెట్టడంతో దందా దారులు మూసుకుపోవాలన్నారు.
Telangana Drugs | గంజాయి, కొకైన్, బ్రౌన్షుగర్, ఎల్ఎస్డీ, హాష్ ఆయిల్.. పేరు ఏదైనా అంతా ఒక్కటే. అదే డ్రగ్స్. ఇలా రకరకాల వ్యసనాలకు యువత చిత్తవుతోంది. సమాజాన్ని పెడదోవ పట్టించే ఈ మత్తు దందాను కూకటివేళ్లతో పెకిలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మత్తు పదార్థాల సరఫరా, అమ్మకం, వాడకంపై పటిష్ట నిఘా పెట్టడంతో దందా దారులు మూసుకుపోవాలన్నారు.
హైదరాబాద్లో విదేశీ కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కల్చర్ కూడా చాపకింద నీరులా మారుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మాదక ద్రవ్యాలతోపాటు, స్థానికంగా లభించే గంజాయి వంటివాటి వినియోగం కూడా పెరుగుతోంది. ఆన్ లైన్ లో కూడా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు కొంతమంది. అరెస్ట్ లు సహజమే కానీ, దీన్ని పూర్తిగా అరికట్టడం మాత్రం సాధ్యం కావడంలేదు. అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఐదు రోజుల్లోనే రేవంత్రెడ్డి దీనిపై ఫోకస్ పెట్టారు. ఇకపై తెలంగాణలో మత్తుమందు అనే పేరే వినపడకూడదని అంటున్నారు. దీని నియంత్రణకోసం ప్రస్తుతమున్న తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను మరింత పటిష్ట పరచాలని సూచించారు. టీఎస్ న్యాబ్( TS-NAB)లో ఖాళీల భర్తీకి కూడా సీఎం ఆమోదముద్ర వేశారు. మత్తుమందుల నియంత్రణకు అనుసరించాల్సిన విధానం, కావాల్సిన సదుపాయాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ తరహాలో TS-NABను బలోపేతం చేసి, పూర్తిస్థాయి అధికారిని నియమిస్తామని చెప్పారు. రివ్యూ చేసిన మరుసటి రోజు నార్కొటిక్ బ్యూరోకు ప్రత్యేక అధికారిని కూడా నియమించారు సీఎం రేవంత్రెడ్డి. హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్ శాండిల్యాను.. నార్కోటిక్ బ్యూరోకు డైరెక్టర్గా అపాయింట్ చేశారు.
డ్రగ్స్తో ఒక తరం జీవితం నాశనం.. చిన్న వయసులోనే మత్తుకు బానిస..
డ్రగ్స్ తో ఓ తరం విచ్ఛిన్నమవుతుందన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన. ఆ ఎఫెక్ట్ సమాజంపై పడుతుందని.. అది మంచిది కాదు అన్నది ఆయన ఆలోచన. అందుకే డ్రగ్స్ పై ఎంత కఠినంగా ఉండాలో.. అంతే స్ట్రిక్ట్గా ఉంటామంటోంది రేవంత్ సర్కార్. ఈ విషయంలో ఎవరిని వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తోంది. అయితే రేవంత్ రెడ్డి డ్రగ్స్ పై ఇంత సీరియస్ కావడానికి ప్రధాన కారణం. గతంలో అనేక కేసులు నమోదైన.. అవి విచారణ మధ్యలోనే ఆగిపోయాయి. ఫలితంగా డ్రగ్స్ వాడకం పెరిగిపోవడం అని తెలుస్తోంది. పోలీసులకు చిక్కకుండా డార్క్వెబ్, ఆన్లైన్లో ఆర్డర్స్ చేసి కొరియర్లో డ్రగ్ పార్సిల్స్ సప్లయ్ చేస్తున్నాయి. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో ప్రతి ఏటా కస్టమర్లతో పాటు డ్రగ్స్ సప్లయర్ల సంఖ్య పెరుగుతోంది. లిక్కర్, గంజాయి కంటే యువత డ్రగ్స్ను తమ స్టేటస్ సింబల్గా మార్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది. వీకెండ్స్ పార్టీలు, పబ్ ఈవెంట్లలో లిక్కర్కు బదులు డ్రగ్స్కు ప్రాధాన్యతనిస్తోంది. ఎంజాయ్మెంట్ మోజులో డ్రగ్స్ను వ్యసనంగా మార్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
డ్రగ్స్ కు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక చూస్తే అసలు విషయం బయటపడుతుంది. మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 29లక్షల మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో దాదాపు రెండు లక్షల మంది పెద్దలు గంజాయిని తీసుకుంటున్నారు. ఆరు లక్షల మంది హెరాయిన్ తీసుకుంటున్నట్టు ఆ నివేదిక చెబుతుంది. ఇక దాదాపుగా 16 లక్షల మంది నేరుగా డ్రగ్స్ తీసుకుంటున్నారని తేలింది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా.. 17 లక్షల మంది డ్రగ్స్ వినియోగదారులతో ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది. గతంలో అల్కహల్ కు అడిక్ట్ అయిన వారిని చూశాం.. కానీ ఇప్పుడు యువత డ్రగ్స్కు బానిసైపోతోంది. 13 ఏళ్ల పిల్లలు కూడా డ్రగ్స్ బారినపడ్డారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో దాదాపుగా 64వేల మంది డ్రగ్స్ను ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటున్నవారు ఉన్నారు. ఇక ఢిల్లీలో 86వేలు, బెంగళూరులో 45వేలు, మహారాష్ట్రలో 44వేల మంది వరకు ఉన్నారు.
హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే దాదాపుగా 104 డ్రగ్స్ కేసులు బుక్ అయ్యాయి.13 మంది విదేశీ పెడ్లర్లు, 185 మంది స్థానిక పెడ్లర్లు, 10 మంది రవాణాదారులు, 1,075 మంది వినియోగదారులను పోలీసులు పట్టుకున్నారు. విదేశీయులలో ముగ్గురు నైజీరియన్లు, ఇద్దరు ఐవరీ కోస్ట్, ఒకరు సూడాన్ దేశస్థుడు ఉన్నాడు. ఈ వింగ్ కేవలం హైదరాబాద్ అనే కాదు.. గోవా, ముంబైల్లో కూడా అనేక డ్రగ్స్ పార్టీలను నిర్వీర్యం చేసింది. 2022లో ఒక్క హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోనే 556 కిలోల గంజాయి, 12 లీటర్ల హాష్ ఆయిల్, 586 గ్రాముల కొకైన్, 295 గ్రాముల హెరాయిన్, 742.5 గ్రాముల MDMA, 355.7 గ్రాముల చరస్, 262 LSDని స్వాధీనం చేసుకున్నారు.
ఆన్ లైన్ ఆర్డర్స్ తో డ్రగ్స్ పార్శిల్స్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కావడం, తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదే హబ్ కావడం, జాతీయ రవాణాతోపాటు, అంతర్జాతీయ రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటంతో.. డ్రగ్స్ వినియోగం కూడా ఇక్కడ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నగరంలో జరిగే నేరాలకు డ్రగ్స్ వినియోగంతో ప్రత్యక్ష సంబంధాలున్నట్టు చాలా సార్లు బయటపడింది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా రేవ్ పార్టీలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. టూరిస్ట్ స్పాట్ గోవాకు వెళ్లిన యువత పార్టీల మోజులో డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇందులో కొకైన్,హెరాయిన్కు నైజీరియన్స్ను నుంచి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత చైన్ సిస్టమ్తో మార్కెటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో ఈవెంట్ల పేరుతో పోస్టులు పెట్టి ఆర్డర్స్ తీసుకుంటున్నారు. కమీషన్స్ ఆశ చూపి కస్టమర్లనే సప్లయర్లుగా మార్చేస్తున్నారు. ఇందులో ఎల్ఎడీ, చరస్,హెరాయిన్,కొకైన్ లాంటి డ్రగ్స్కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.
మరోవైపు ప్రస్తుతం యువత జీవనవిధానం చాలా మారిపోయింది. పబ్ కల్చర్, పార్టీలు ఓ ఫ్యాషన్ గా మారిపోయాయి. లేట్ నైట్ పార్టీలు సర్వరాధారణమైపోయాయి. అయితే ఇవి శృతిమించిపోతున్నాయి. దీంతో విచ్చలవిడిగా డ్రగ్స్ కు బానిసవుతున్నారు యువతీ, యువకులు. చిన్నవయస్సులోనే భారీ మొత్తంలో జీతాలు, ఇంటికి దూరంగా హాస్టల్స్ లో జీవించడం లాంటి జీవనవిధానంతో డ్రగ్స్ వాడకం అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. పబ్ లు, పార్టీలతో యువతీ, యువకుల హల్ చల్ నిత్యకృత్యమైంది. ఆయా పార్టీల్లో మోతాదుకు మించిన మద్యానికి.. డ్రగ్స్ కూడా తోడవుతున్నాయి. పని ఒత్తిడి, తోటి వారి ప్రోద్బలం, చిన్నచిన్న ఎదురుదెబ్బలు, అపజయాలకు కూడా తట్టుకోలేని సున్నితత్వంతో యువత డ్రగ్స్ ను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం, డ్రగ్స్ వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. వీటికి దూరంగా ఉండే వారిని..చులకనగా చూడడం పరిపాటిగా మారింది. కొన్ని గ్రూపుల్లో అయితే అలాంటి వారిని చేర్చుకోవడానికి కూడా ఫ్రెండ్స్ అంగీకరించని పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఈ కారణాలతోనే డ్రగ్స్ వాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుందన్న వాదనలున్నాయి.