CM Revanth Reddy: తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా అన్యాయం జరగకుండా, ప్రభుత్వం తరఫున తాము అన్ని విధాల అండదండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు బృందంతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని, సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ఆహ్వానితులుగా కేశవరావు ఉంటారన్నారు. దీపావళి పండుగ తర్వాత అన్ని శాఖల వారీగా సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తుందన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందడుగు వేస్తుందని, డీఏల విషయంలో రేపటి సాయంత్రంలోగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఎం చెప్పగా, ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మరోవైపు అభివృద్ధి పథంలో నడిపించేందుకు తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని, అందుకు ఉద్యోగుల సహాయ సహకారాలు అవసరమన్నారు.
అలాగే ఉద్యోగుల సమస్యలైన హెల్త్ కార్డులు, పీఆర్సీ, సీపీఎస్ విధానంపై త్వరలోనే సబ్ కమిటీ సమావేశమై తుది నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా ఉద్యోగులు గమనించి, ప్రభుత్వానికి సహకరించాలని, సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల సమస్యలను ఒకొక్కటిగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎంతో సమావేశమైన ఉద్యోగ సంఘాలు.. సీఎం స్పందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసి, దీపావళి పండుగ తర్వాత సబ్ కమిటీతో తమ సమావేశమై ఉద్యోగుల సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చిస్తామన్నారు. జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన నివేదికపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సీఎం భరోసానిచ్చారు.
అంతేకాకుండా ఇటీవల ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాక, పలు ఉద్యోగాల భర్తీ కూడ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని, తాను ఉద్యోగుల పక్షపాతిగా ఉంటూ త్వరలోనే అన్నీ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం భరోసానిచ్చారు. ఈ సమావేశం 3 గంటల పాటు సాగగా, ప్రతి సమస్యను సీఎం రేవంత్ తెలుసుకొని, వాటి పరిష్కార మార్గాలపై కూడా సీఎం సమీక్షించారు.