– తెలంగాణలో భారీ వర్షాలు
– అధికారులకు అలర్ట్ చేసిన ప్రభుత్వం
– జల దిగ్బంధంలో మణుగూరు
– ఆదిలాబాద్లో పెన్గంగా ఉద్ధృతి
– కడెం నుంచి భారీగా వరద
– మహబూబాబాద్లో తెగిన చెరువు కట్టలు
– కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
– విజయవాడ, కాజీపేట మధ్య రైళ్ల నిలిపివేత
– వరద నీటిని ఒడిసిపట్టాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు
– రిజర్వాయర్లు నింపాలన్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana Rains: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, నల్గొండ జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకోవాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి ఉత్తమ్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మరోవైపు ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌస్ ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు.
మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్తో పాటు రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా 18.45 టీఎంసీలకు నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలు ఉంది. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కులకు పైగా లోయర్ మానేరు డ్యామ్కు, మరో 6400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్ సాగర్కు తరలిస్తున్నారు. అటు నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని చెప్పారు సీఎం. మల్లన్నసాగర్ ఫుల్ కెపాసిటీ 50, కొండ పోచమ్మ సాగర్లో 15 టీఎంసీల కెపాసిటీ ఉంది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని చెప్పారు రేవంత్.
Also Read: BRS Party: మీరసలు మంత్రులేనా?.. బీఆర్ఎస్ నేతల విమర్శలు
రేవంత్కు అమిత్ షా ఫోన్
తెలంగాణలో వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. తెలంగాణలో వర్షాలు, వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన తక్షణ సాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.