CM Revanth Reddy Suggestion to Protesters: తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని, మరిన్ని పోస్టులు జోడించి మెగా డీఎస్సీ వేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 ఫైనల్స్కు 1:50కి బదులు 1:100 తీసుకోవాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే స్పష్టత ఇచ్చారు. నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని, అందులో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగులే నష్టపోతారని చెప్పారు. అసలు ధర్నాకు దిగిన ముగ్గురూ పరీక్షలు రాసేవారు కాదని, వారి వారి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉన్నాయని వివరించారు. కాబట్టి, అమాయక విద్యార్థులు వారి ఉచ్చులో పడొద్దని సూచనలు చేశారు.
పరీక్షల వాయిదా ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వడంతో అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులు రోడ్డెక్కారు. నిరసనలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ఆలకించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గత పదేళ్లుగా నోటిఫికేషన్ లేనందున ఈ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం అభినందనీయమేనని, కానీ, ఒకేసారి పరీక్షలు వరుసగా నిర్వహించడం మూలంగా ఒకే పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉన్నదని, వేరే పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నా వాటికి ప్రిపేరై పరీక్షలు రాసే పరిస్థితి లేదని బాధపడ్డారు.
Also Read: Ministers visits Warangal: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలోనే..
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని వివరించారు. కానీ, వాటిని వాయిదా వేస్తే వారికి నష్టమని చెప్పారు. ఇక గ్రూప్స్ ఎంపిక ప్రక్రియలో మార్పులు చేస్తే ఎవరు కోర్టుకు ఎక్కినా పరీక్ష వాయిదా పడుతుందని, మళ్లీ వ్యవహారం మొదటికి వస్తుందని హెచ్చరించారు. ఒక వేళ విద్యార్థులు నిజంగా తమ సమస్యలను చెప్పాలని అనుకుంటే వినడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు నేరుగా మంత్రుల వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల కుట్రలో పావులుగా మారొద్దని హితవు పలికారు.