CM Revanth Reddy Speech in Dharmapuri Jana Jathara Sabha: సింగరేణి బొగ్గు గనులు కాదు సింగరేణి నల్ల బంగారానికి ప్రసిద్ధి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులు కోల్ బెల్ట్ ఏరియాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారని గుర్తు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్కు ఒక గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించిన పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందినవారేనని గుర్తు చేశారు.
1990లో సింగరేణి దివాళా తీస్తే.. కాపాడిన ఘనత దివంగత నేత వెంకటస్వామిదని పేర్కొన్నారు. ఇక స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన శ్రీపాదరావు మంథని ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారన్నారు. ధర్మపురి జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని అన్నారు.
కొప్పుల ఈశ్వర్ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టి కాంగ్రెస్ను గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ దిక్కు లేని బీఆర్ఎస్.. కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థిగా నిలబెట్టిందని, ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు, ఈశ్వర్కు లేదని అన్నారు. బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తుంటే మౌనంగా ఉన్న ఈశ్వర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికలతో బీఆర్ఎస్ పార్టీ పీడ పూర్తిగా విరగడవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Rapolu Anand Bhaskar: కేసీఆర్కు మరో షాక్.. స్పీడ్ పోస్ట్ ద్వారా తెలంగాణ భవన్కు..
కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని సీఎం అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారని, తెలంగాణకు ఏమీ ఇవ్వని ప్రధాని.. గుజరాత్కు లక్షల కోట్లు తరలించుకుపోయారని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. అందుకే 400 సీట్లు కావాలని బీజేపీ కోరుతోందని.. దళిత, గిరిజన, ఓబీసీల హక్కులను కాలరాయలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శల వర్షం గుప్పించారు. 2021లో జనగణన, కులగణన జరగాల్సిన అవసరం ఉన్నా బీజేపీ ఆ పని చేయలేదన్నారు.
2021లో జనగణన, కులగణన ఎందుకు చేపట్టలేదని బండి సంజయ్, కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న కుట్ర లేదా అని అన్నారు. రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. రిజర్వేషన్లు పెరగాలంటే కాంగ్రెస్కు ఓటు వేయండని పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: బీజేపీ కుట్ర, జాగ్రత్త పడకపోతే.. మునిగిపోతాం: రేవంత్ రెడ్డి
పత్తిపాక రిజర్వాయర్ మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పాలకుర్తి లిఫ్ట్ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రామగుండంలో 800 మెగా వాట్ల పవర్ స్టేషన్ నిర్మిస్తామని.. అలాగే నేతకాని సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.