కొండంత ఆప్యాయత
– దసరా వేళ స్వగ్రామంలో సీఎం
– డప్పు దరువులు, కోలాటాలు, పూలవానతో అపూర్వ స్వాగతం
– పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
– ప్రజల ఆదరణకు సీఎం ధన్యవాదాలు
– కొండారెడ్డిపల్లి వాసుల అభిమానంపై స్పెషల్ ట్వీట్
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామానికి వెళ్లారు రేవంత్ రెడ్డి. దసరా పర్వదినాన అక్కడకు వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ టూర్కు సంబంధించి ప్రజలు చూపిన ఆప్యాయతను గుర్తు చేసుకుంటూ ఆదివారం ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు.
కొండారెడ్డిపల్లిలో పూలజల్లు…
‘‘కొండంత ఆప్యాయతను గుండెల నిండా నింపుకుని నా కొండారెడ్డి పల్లి పూలజల్లై మురిసింది’’ అంటూ తనపై జనం పూలు జల్లిన ఫోటోను పంచుకున్నారు. టూర్లో భాగంగా ర్యాలీ నిర్వహించగా జనం నీరాజనాలు పట్టారు. అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు సీఎం.
ఆయన రాకతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన రేవంత్, గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.72 లక్షలతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అక్కడ మామిడి మొక్కను నాటారు. రూ.18 లక్షలతో కట్టిన గ్రంథాలయం ఓపెన్ చేశారు.
పల్లెలో మమతానురాగాలు…
ఎస్సీ కమ్యూనిటీ భవనం, మురుగు నీటి పైప్ లైన్ నిర్మాణం, శుద్ధి కేంద్రం, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు, చిల్డ్రన్స్ పార్క్, జిమ్తో పలు పనులను ప్రారంభించారు. కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, బంధు మిత్రులు శ్రేయోభిలాషులతో కలిసి జమ్మిపూజలో పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుంచి కొండంగల్ వెళ్లారు. అక్కడ తన నివాసంలో స్థానిక నాయకులను, నియోజకవర్గ ప్రజలను కలిసి, ఆత్మీయంగా పలకరించారు. ఆదివారం అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ టూర్కు సంబంధించి ఓ ప్రత్యేక వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు సీఎం.
Also Read : సచివాలయంలో రేపు స్పెషల్ జాబ్ పోర్టల్ ఆవిష్కరణ… హాజరుకానున్న మంత్రి సీతక్క