CM Revanth Reddy Special Invitation to KCR(Telangana news today): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రొటోకాల్ సలహాదారుకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. జూన్ 2న ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించబోయే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కూడా ఈ వేడుకలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ.. ఈ వేడుకలకు హాజరవుతున్నట్లు ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తోంది.
కాగా, రాష్ట్ర అధికారిక గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. సచివాలయంలో ఇందుకు సంబంధించి ఆయన పలువురు ప్రముఖులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తు సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు, కోదండరాంతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర గీతం, చిహ్నంపై చర్చించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఆయన బృందం జయ జయహే పాటను పాడి వినిపించారు. వెంటనే నేతలు స్పందిస్తూ.. పాట బాగుందంటూ పేర్కొన్నారు. అనంతరం పలు సూచనలు కూడా చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ దిశగా పరిశీలించాలంటూ కవి అందెశ్రీకి సీఎం సూచించిన విషయం తెలిసిందే.
Also Read: సార్ మీ ఆరోగ్యం ఎలా ఉంది..? చుక్కా రామయ్యకు సీఎం పరామర్శ
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారిక చిహ్నం విషయంలో ఇంకా సమయం తీసుకుంటామని చెప్పారు. ఎవరు సలహాలు, సూచనలు ఇచ్చినా తీసుకుంటామన్నారు.