Sunburn Festival: న్యూ ఇయర్ వేడుకలకు నగరం ముస్తాబవుతోంది. డిసెంబర్ 31న 2023కు స్వస్తి పలికి.. 2024కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా నగరంలో సన్బర్న్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వేడుకను మాదాపూర్లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుండగా.. బుక్ మై షో ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్రెడ్డి.
నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో సన్బర్న్ ఈవెంట్పై చర్చ జరిగింది. ఈ ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని.. ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేవారు ఎవరైనా సరే.. పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపారు. అనుమతి లేకుండా టికెట్లను విక్రయిస్తే.. చర్యలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు.