రాజకీయాలకు అతీతం
అలయ్ బలయ్
– దసరా అంటే జమ్మిచెట్టు, పాలపిట్ట గుర్తొస్తే..
– అలయ్ బలయ్ అంటే దత్తాత్రేయ గుర్తొస్తారు
– ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం ఇది
– పొలిటికల్ జేఏసీ ఆవిర్భవానికి మూలమైంది
– జెండాలను పక్కనపెట్టి అందర్నీ ఏకం చేసింది
– తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకుందాం
– రాష్ట్ర నేతలు, ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
హైదరాబాద్, స్వేచ్ఛ : దసరా వచ్చిందంటే చాలు గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించే అలయ్ బలయ్ గుర్తొస్తుంది. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నాయకులు ఒకే వేదికపైకి చేరి నవ్వులు పూయిస్తుంటారు. 19 ఏళ్లుగా నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, మేఘాలయ గవర్నర్ విజయ్ శంకర్, రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్ రావ్ బాగ్డే, ఇంకా ఇతర నేతలు పాల్గొన్నారు.
19 ఏళ్లుగా అలయ్ బలయ్…
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత 19 ఏళ్ల నుంచి దసరా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా దత్తాత్రేయ ఈ అలయ్ బలయ్ను నిర్వహిస్తున్నారని చెప్పారు. అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను అలయ్ బలయ్ ద్వారా పునరుద్దరించడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ సంస్కృతిని నలు దిశలా వ్యాపించడానికి, ఉద్యమంలో రాష్ట్ర సాధన ఆలస్యం అయినప్పుడు పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు ఈ అలయ్ బలయ్ స్ఫూర్తిగా ఉపయోగపడిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీల వారీగా కార్యక్రమాలు జరిగేవన్న సీఎం, తెలంగాణ ఉద్యమ సాధనలో అన్ని వర్గాలను కార్యోన్ముఖులై అడుగు ముందుకు వేయడానికి అలయ్ బలయ్ కూడా ఓ కారణమని పేర్కొన్నారు.
అలయ్ బలయ్ అంటే దత్తన్నే…
తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా అని, దసరా అంటే పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయన్నారు. అలాగే, అలయ్ బలయ్ అంటే గుర్తుకు వచ్చేది బండారు దత్తాత్రేయ అని చెప్పారు. ఆయన వారసురాలిగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్న బండారు విజయలక్ష్మికి అభినందనలు తెలియజేశారు. ఆమె దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు.
అంతా ఒక్కటే…
తెలంగాణ సంప్రదాయాలు కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పేందుకు తమ ప్రభుత్వం, పార్టీ పెద్దలంతా అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. తామంతా ఒక్కటే అన్న సందేశాన్ని అలయ్ బలయ్ ద్వారా నాయకులు ఇచ్చారని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
also read : ‘అలయ్ బలయ్’కి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణ సాంప్రదాయలపై దిశానిర్దేశం